పాఠశాల బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ ఇవ్వాలని పిల్.. కేంద్ర, రాష్ట్రాల స్పందన కోరిన సుప్రీం ధర్మాసనం
ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి చదివే బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ ఇచ్చే అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు స్పందించాలని సుప్రీంకోర్టు కోరింది. ఈ మేరకు సోమవారం నోటీసులు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్లు అందించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ పిల్ ను ధర్మాసనం స్వీకరించింది. దీనిపై సమాధానం చెప్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
మధ్యప్రదేశ్కు చెందిన డాక్టర్, సామాజిక కార్యకర్త జయ ఠాకూర్ దాఖలు చేసిన ఈ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ విషయంపై స్పందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో అన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమాధానాలు చెప్పాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
ప్రభుత్వ, ప్రభుత్వ-ఎయిడెడ్ పాఠశాలల్లోని బాలికల పారిశుధ్యం, పరిశుభ్రత వంటి ముఖ్యమైన సమస్యను పిటిషనర్ లేవనెత్తారని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ విషయంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సహాయం కూడా కావాలంటూ సుప్రీంకోర్టు కోరింది.