Asianet News TeluguAsianet News Telugu

ఈ దేశాలకు అప్పుడే భారత్ అంటే భయం మొదలైంది

భారతదేశంలో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు జాతీయ సరిహద్దులను దాటి అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దేశాన్ని పాలించే నాయకత్వాన్ని ఎంచుకోవడమే కాదు ప్రపంచంలో భారత పాత్రను కూడా ఈ ఎన్నికల ఫలితం  నిర్ణయిస్తుంది. అందువల్లే అంతర్జాతీయ సమాజం కూడా ఈ ఎన్నికలను పరిశీలిస్తున్నాయి. ఈ సందర్భంగా ఎస్ గురుమూర్తి సమగ్ర కథనం....

The Significance of the 2024 Elections ; Swaminathan Gurumurthy AKP
Author
First Published Apr 4, 2024, 12:26 AM IST

2024 పార్లమెంట్ ఎన్నికలు భారతదేశ ప్రజాస్వామ్య ప్రయాణంలో మరో కీలక ఘట్టం. ఏప్రిల్ 19 నుండి ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల పండగ ప్రారంభమై పలు దశల్లో సాగనుంది. ఈ క్రమంలో ఓటర్లను ప్రభావితం చేసే అంశాలను ఓసారి పరిశీలిద్దాం. జాతీయ, అంతర్జాతీయ, స్థానిక... ఈ మూడుకోణాల్లో సమగ్రంగా విశ్లేషించుకుందాం.  ఈ ఎన్నికల ప్రక్రియ గత సవాళ్లను అధిగమించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దేశ భవిష్యత్ పై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకుందాం. 

రాజకీయ పరివర్తన : 

2024 పార్లమెంట్ ఎన్నికలు కేవలం స్థానిక వ్యవహారాలనే కాదు అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న దేశ పలుకుబడిని తెలియజేస్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడిని సైతం అధిగమించినట్లు ది అమెరికన్ థింక్ ట్యాంక్ మార్నింగ్ కన్సల్ట్ ప్రకటించింది. గత ఐదేళ్లుగా మోదీ చరిష్మా అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతూవచ్చి విశ్వగురుగా నిలిపింది. ప్రపంచ దేశాధినేతలు మోదీని ప్రశంసిస్తున్నారు.  ఆస్ట్రేలియా ప్రధాని మోదీని మంచి నాయకుడిగా అభివర్ణిస్తే ఇటలి ప్రధాని కూడా గొప్ప నాయకుడంటూ పొగిడారు. యూఎస్ఐ అధ్యక్షుడు కూడా మోదీని పవర్ ఫుల్ లీడర్ గా అంగీకరించారు.  ఇక రష్యా అధ్యక్షుడు కూడా మోదీని అత్యంత దైర్యవంతుడే కాదు చాలా తెలివైనవాడని కొనియాడారు. ఇక బ్రిటీష్ ప్రధానమంత్రి ప్రపంచ నాయకుడిగా పేర్కొన్నారు. పపువా న్యూ గినియా అధ్యక్షుడు కాళ్లు మొక్కాడంటే భారత ప్రధాని మోడీ స్థాయి అంతర్జాతీయ వేదికలపై ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. 

ఒకప్పుడు మోదీని బహిష్కరించిన పాశ్చాత్య దేశాలు ఇప్పుడు ఆయనను కీర్తిస్తున్నాయి. ఇది ఆయన బలమైన నాయకత్వానికి నిదర్శనం. అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ సైతం ''మీరే నాకు అసలు సమస్య. మీరు మా దేశాన్ని పర్యటించిన ప్రతిసారీ గమనిస్తున్నా.... అందరి దృష్టి మీపైనే వుంటోంది. మీతో కలిసి భోజనం చేసే అవకాశం కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. సెలబ్రిటీల నుండి నా సొంత బంధువుల వరకు  ప్రతి ఒక్కరూ మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు. మీరు ప్రజాస్వామ్య దేశాలను పునర్నిర్మించే నిజమై నేతగా మారారు. 2022లో G20కి మోడీ నాయకత్వం ఒక మలుపు తిరిగింది, ఇది సమూహాన్ని అపూర్వమైన విజయం వైపు నడిపించింది'' అంటూ కొనియాడాడు. 2022 లో మోదీ G20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టడమే కీలక మలుపు... ఇది యావత్ భారతదేశాన్నిమరో అద్భుత విజయంవైపు నడిపించింది. 

2014 తర్వాత అమెరికా, యూరప్ దేశాలతో భారత సంబంధాలే ప్రధాని మోదీ అలుపెరగని ప్రయత్నాలు నిదర్శనం.  మొదట్లో మోదీ విదేశీ పర్యటనలను ప్రత్యర్థి రాజకీయ పార్టీలు, మీడియా సంస్థలు వెక్కిరించాయి... కానీ ఆ పర్యటనలే బలమైన అంతర్జాతీయ సంబంధాలను ఏర్పర్చాయని అర్థమవుతోంది. చరిత్రలో నిలిచిపోయేలా ఏ ప్రధాని పర్యటించనన్ని సార్లు ఆస్ట్రేలియాలో పర్యటించారు మోదీ... తద్వారా ఇప్పుడు మన దేశానికి బలమైన మిత్రదేశంగా ఆస్ట్రేలియా మారింది. కాబట్టి మోదీపై ప్రశంసలను ఆయన వ్యక్తిగతంగా కాకుండా దేశానికే గర్వకారణంగా చూడాలి. ప్రపంచ దేశాలను మోదీ ఎంతగానో ఆకట్టుకుంటున్నారు... ఆయన రాజనీతిజ్ఞత దేశ అభివృద్దికి పునాదులు వేస్తోంది. 

ఆర్థిక పునరుజ్జీవనం: దుర్బలత్వం నుండి శక్తి వరకు :

2014కి ముందు దశాబ్దాల పాటు భారత్ ఆర్థిక సంక్షోభంతో వుండేది. ఆనాడు దేశ వృద్ధి రేట్లు క్షీణించడం మరియు ద్రవ్యోల్బణం అధికంగా వుండటంతో పాటు పెద్ద పెద్ద స్కామ్ లు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేవి. ఈ యుగంలో భారతీయ సంస్థలుఅప్పుల్లో మునిగిపోవడం చూసాం... కాలక్రమేన ఇవి నిరర్థక ఆస్తులుగా రూపాంతరం చెందాయి. చివరకు ప్రభుత్వ ఆధీనంలోని బ్యాంకులు దివాళా తీసాయి. చివరకు భారత్ తన అవసరాల కోసం అంతర్జాతీయ సంస్థల వద్ద అప్పులు చేయాల్సి వచ్చింది. తద్వారా భారత ఆర్థిక వ్యవస్థ అంత్యంత బలహీనమైనదిగా గుర్తింపు పొందింది. 

అయితే ప్రస్తుతం దేశ పరిస్థితి పూర్తిగా మారిపోయింది... కాలం గిర్రున తిరిగి భారత్ ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.  అయితే ఇదేదో యాదృచ్చికంగా  సాధించిన ఘనత కాదు... దీని వెనక ప్రధాని ఆర్థిక వ్యూహాలు, ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు వున్నాయి. మొత్తంగా దేశ పాలకుల నిబద్దతకు ప్రతిఫలమే దేశ ఆర్థిక వృద్దిగా చెప్పవచ్చు. 

ఒకప్పుడు దేశాన్ని పట్టిపీడించిన అవినీతి అనేది ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కనిపించడంలేదు. అలాగే ఆర్థిక అవకతవకలకు తావులేకుండా పాలన సాగుతోంది. ఒకప్పుడు గొప్ప వ్యాపారవేత్తలుగా చలామణి అయినవారిలో కొందరు ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకోవాల్సి వస్తోంది... ఉద్దేశపూర్వకంగా రుణాల ఎగవేతకు పాల్పడినవారు, అవకతవకలకు పాల్పడినవారికి ఈ పరిస్థితి వచ్చింది. ఇక  గతంలో నష్టాలతో సతమతమై పతనావస్థకు చేరుకున్న  ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పుడు రికార్డు స్థాయిలో లాభాలను నమోదు చేస్తున్నాయి. హైవేలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు అభివృద్ధితో అపూర్వ ప్రగతి కళ్లముందు కనిపిస్తోంది. ఇక స్టాక్ మార్కెట్ కూడా2014 లో 20,000 వుంటే ప్రస్తుతం 73,000 కు చేరుకుంది... ఇది దేశ అభివృద్దికి సూచికగా నిలిచింది. గత పదేళ్లలో ఎన్నో అద్భుతాలు జరిగి దేశ ఆర్థిక రంగం  పునర్నిర్మించబడింది... దీంతో అంతర్జాతీయ సమాజం నుండి భారత్ గౌరవాన్నే కాదు నమ్మకాన్ని పొందింది.

భారత్ సాధించిన మైలురాళ్ళు : 

నరేంద్ర మోదీ హయాంలో ప్రపంచ దృష్టిని భారత్ వైపు తిప్పిన అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి. దేశ పరిస్థితుల్లో పరివర్తన తీసుకువచ్చే ఘటనలు అనేకం... వాటిలో ముఖ్యమైన కొన్నింటిగురించి తెలుసుకుందాం. ఇవి దేశం రూపాంతరం చెందడంలో ఎంతగానో తోడ్పడ్డాయి. 

1. కరోనా వ్యాక్సిన్ డెవలప్ మెంట్ : యావత్ ప్రపంచంతో పాటు భారతదేశాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేసింది. ఇలాంటి సమయంలో వ్యాక్సిన్ కోసం ఇతదేశాల వైపు చూడకుండా మోదీ సర్కార్ ఆత్మనిర్భర నినాదాన్ని ఎత్తుకుంది. తద్వారా అతి తక్కువ సమయంలోనే దేశీయంగానే రెండు కరోనా వ్యాక్సిన్ ను రూపొందించారు. వ్యాక్సిన్ తయారీ ఒక ఎత్తయితే దాన్ని దేశ ప్రజలందరికీ అందించడం మరో ఎత్తు... దీన్ని కూడా మోదీ గవర్నమెంట్ సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసింది. ఇలా 1.02 బిలియన్ భారత పౌరులకు రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ అందించి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. 

2. ఆర్థిక వృద్ది : మోదీ ప్రభుత్వ కీలక ఆర్థిక సంస్కరణలు చేపట్టింది. దేశంలో బ్యాంకుల గురించి తెలియన పేద మద్యతరగతి ప్రజలను  ఉచితంగానే బ్యాంక్ అకౌంట్స్ తెరిపించింది. ఇలా దేశవ్యాప్తంగా 520 మిలియన్ల మందితో బ్యాంక్ ఖాతాలు తెరిపించి ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం చేసారు. ఇక రూ.5.53 ట్రిలియన్ల సబ్సిడీ డబ్బులను నేరుగా అర్హులకు బదిలీ చేసారు. ఇలా మోదీ సర్కార్ తెరిపించిన బ్యాంకు ఖాతాల్లో రూ.2.30 ట్రిలియన్ల డబ్బు జమయి వుంది... ఇలా ఆర్థికంగా వెనుకబడిన వారిని మోదీ సర్కార్ చేయూత అందించింది. 

3. ఆరోగ్య సంరక్షణ :దేశవ్యాప్తంగా 340 మిలియన్ల ప్రజలు ప్రస్తుతం ఆరోగ్య భీమా సదుపాయాన్ని కలిగివున్నారు. మోదీ సర్కార్ నిర్ణయాలతో 58 మిలియన్ల మందికి రూ.660 బిలియన్ల విలువైన వైద్య చికిత్సలు చాలా సులభంగా అందుతున్నాయి. తద్వారా పబ్లిక్ హెల్త్‌కేర్ విషయంలో భారతదేశం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న అపవాదు తొలగిపోతోంది. 

4. పారిశుద్ధ్య విప్లవం: దేశవ్యాప్తంగా 530,000 గ్రామాల్లో 115 మిలియన్ల మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది. దీంతో దేశంలో బహిరంగ మలవిసర్జన   నిర్మూలించబడింది. దీంతో మన దేశం విదేశాల ముందు నవ్వులపాలు కాకుండా గర్వంగా తలెత్తుకోగలుగుతోంది. 

5. గ్యాస్ కనెక్షన్లు : మహిళల ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణ దిశగా మోదీ సర్కార్ కీలక ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా 100 మిలియన్ల కుటుంబాలకు వంట గ్యాస్ కనెక్షన్‌లను అందించింది ప్రభుత్వం. ఈ చర్యతో మోదీ సర్కార్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించబడింది.

6. ప్రతిఒక్కరికి పక్కా ఇళ్లు : గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లులేని నిరుపేదలకు పక్కా ఇళ్లు కట్టించే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. ఇలా దేశంలో 26 మిలియన్ల కుటుంబాలకు ఉచిత గృహాలను మంజూరు చేసింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అంతర్జాతీయ సమాజాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో భారతదేశం యొక్క నిబద్ధత ఏమిటో ప్రపంచ దేశాలకు అర్థమయ్యింది.
  
ఈ మైలురాళ్ళు కేవలం దేశీయంగానే కాదు  ప్రపంచ వేదికపై భారతదేశ స్థాయిని గణనీయంగా పెంచాయి. ఇది మోదీ నాయకత్వాన్ని, భారతదేశం యొక్క ప్రగతిశీల పథాన్ని ప్రతిబింబిస్తుంది.


అత్యున్నత స్థాయికి భారతదేశం :

ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు దేశ రూపరేఖలను మార్చడమే కాదు ప్రపంచ దేశాల ప్రశంసలు పొందుతున్నాయి. దేశ ఆర్థిక పురోగతిపై ఇతర దేశాధినేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రెంచ్ ప్రెసిడెంట్ మాక్రాన్ 'ఇండియా ప్రపంచాన్ని మారుస్తోంది' అని కామెంట్ చేసారు. ఇటీవల 29 ప్రజాస్వామ్య దేశాలపై ఓ సంస్థ ఒపీనియన్ పోల్‌ నిర్వహించింది... ఇందులో 77 శాతం మంది భారత అభివృద్ది సరైన పద్దతిలోనే జరుగుతోందని అభిప్రాయపడ్డారు.  ఇక అమెరికా (65%), జర్మనీ (72%), కెనడా (70%), ఇంగ్లండ్ (79%) శాతంగా వుంది. ఇక ఈ దేశాలన్ని భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా వుందని పేర్కొంటున్నాయి. 

భారతదేశ అభివృద్ధి, పునరుజ్జీవనానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలనే కారణంగా అంతర్జాతీయ సమాజం గుర్తించింది. హెన్రీ కిస్సింజర్ మరియు జార్జ్ సోరోస్ వంటివారు వెస్టర్న్ ఆధిపత్యం తగ్గిందని చెబుతున్నారు. కరోనా సమయంలో వ్యవహరించిన తీరు, ఉక్రెయిన్ విషయంలో దౌత్యంతో మోదీ మరోస్థాయికి చేరుకున్నారు.  

ఇక భారత సరిహద్దుల్లో చైనాను నియత్రించడం... ఆ దేశంపట్ల అనుసరిస్తున్న కఠిన వైఖరి... డోక్లామ్ నుండి లడాక్ వరకు అనుసరిస్తున్న వ్యూహం విదేశాల దృష్టిని ఆకర్షించింది. ఇక భారత్ తన సాంప్రదాయిక పొత్తులకు అతీతంగా ఆసియా, యూరప్ మరియు   దక్షిణాది దేశాలతో కొత్త బంధాలను ఏర్పరచుకుంది. ఇలా ప్రపంచ వేదికపై తనను తాను కీలకమైన మధ్యవర్తిగా మారింది. ఉక్రెయిన్, రష్యా యుద్ద సమయంలోనే భారత్ మద్యవర్తిత్వం కోసం ప్రపంచ దేశాలు ఎదురుచూసాయి. 

అభివృద్ది చెందుతున్న ఇండియా నమూనా ప్రపంచ దేశాలను ఆకట్టుకుంటోంది. విదేశీ నిధులతో కూడిన NGOలు మరియు సామూహిక నిరసనలతో భారత్ ను అప్రతిష్టపాలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వాదనలు వున్నాయి. ఇలా అనేక సవాళ్లు ఎదురవుతున్నా ఇండియా ఏమాత్రం బెదరడం లేదు... మోదీ పాలనలో  దేశ సంకల్పం స్థిరంగా ఉంది.
  

''భారతదేశ సార్వభౌమాధికారం"

ప్రపంచ వేదికలపై భారతదేశ అభివృద్దిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రపంచాన్ని దిశానిర్దేశం చేసే దేశాలకు భారతదేశ పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. వారి ఆందోళనకు కారణం భారత అభివృద్ది విధానమే కాదు ప్రధాని నరేంద్ర మోడీ యొక్క దృఢమైన నాయకత్వం. 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పాశ్చాత్య మీడియా భారతీయులను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తోంది.   

మోదీ నాయకత్వం భారతదేశ నాగరికత పునరుజ్జీవనానికి ప్రతీక. మానవాళిలో ఆరవ వంతుకు ప్రాతినిధ్యం వహిస్తూ, భారతదేశం యొక్క అభివృద్ధి చెందుతున్న ఆర్థిక, సైనిక మరియు సాంకేతిక సామర్థ్యాలు, దాని గొప్ప సాంస్కృతిక వారసత్వంతో పాటు, ఒక కొత్త నమూనాను అందిస్తున్నాయి. ఇది పాశ్చాత్య ఉదారవాద క్రమంలో కొందరు తమ సాంప్రదాయ ఆధిపత్యానికి సవాలుగా మోడీ భారతదేశాన్ని చూసేందుకు దారితీసింది.

భారతదేశంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు జాతీయ సరిహద్దులను దాటి విస్తరించేలా కనిపిస్తున్నాయి. ఈ నాయకత్వ ఎంపిక దేశీయ పాలన గురించి మాత్రమే కాదు, ప్రపంచంలో భారతదేశ పాత్ర గురించి కూడా. ప్రపంచ వేదికపై భారతదేశం యొక్క మార్గాన్ని మరియు దాని నాగరికత విలువలను ప్రజల నిర్ణయం పునరుద్ఘాటిస్తుంది... కాబట్టి ఈ ఎన్నికల ఫలితంపై ఆసక్తి నెలకొంది. 


పాఠకులకు గమనిక : ఈ వ్యాసం మొదట తుగ్లక్ తమిళ వీక్లీ మ్యాగజైన్‌లో వచ్చింది. ఇది www.gurumurthy.net కోసం తుగ్లక్ డిజిటల్ ద్వారా ఇంగ్లీష్ లో ట్రాన్స్ లేట్ అయ్యింది.  ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్‌లో ప్రచురించబడింది. ఇందులో వ్యక్తీకరించబడిన అభిప్రాయాలు పూర్తిగా వ్యాసకర్త వ్యక్తిగతమైనవి.

Follow Us:
Download App:
  • android
  • ios