దారుణం : తోపుడు బండిపై గర్భిణీ భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లిన భర్త...కానీ..
మధ్యప్రదేశ్ లో ఓ భర్త గర్భిణీ అయిన తన భార్యను తోపుడు బండిపై ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. కానీ.. అక్కడ సిబ్బంది అందుబాటులో లేరు. దీంతో...
మధ్యప్రదేశ్ : స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా.. ఇప్పటికీ.. దేశంలోని అన్ని ప్రాంతాలకు వైద్య సదుపాయాలు అందుబాటులోకి రాలేదు. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు సరైన వైద్య సౌకర్యాలు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని చోట్ల అధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది అలసత్వం అమాయకుల ప్రాణాలను తీస్తుంది. తాజాగా ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న భార్యను కాపాడుకునేందుకు ఆ భర్త చేసిన ప్రయత్నం కన్నీళ్లు పెట్టిస్తోంది. అంబులెన్స్ రాకపోవడంతో చేసేదేమీలేక తోపుడు బండిపై తోసుకెళ్ళాడు ఆ భర్త.
అయితే ఆసుపత్రికి వెళ్లాక కూడా అతనికి నిరాశే ఎదురైంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం దామోహ్ జిల్లాలోని రానేహ్ ప్రాంతానికి చెందిన కైలాష్ అహిర్వార్, తన భార్య కాజల్ తో కలిసి ఉంటున్నాడు. కాజల్ నిండు గర్భిణి. నెలలు నిండడంతో ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో, ఆమెకు చికిత్స అందించేందుకు ఆస్పత్రికి తరలించాలని అంబులెన్స్ కు ఫోన్ చేశాడు కైలాష్. అయితే, ఎన్నిసార్లు ఫోన్ చేసినా.. అంబులెన్స్ సిబ్బంది నుంచి స్పందన రాలేదు. ఓవైపు భార్యకు పురిటినొప్పులు మరోవైపు అంబులెన్స్ లేకపోవడంతో గత్యంతరం లేక తోపుడు బండిపై కాజల్ ను పడుకోబెట్టి కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్ళాడు.
భార్యమీద అలిగి తాటిచెట్టెక్కాడు.. నెలరోజులుగా, తిండి,నిద్ర.. మకాం అక్కడే.. ఎక్కడంటే...
అయితే అక్కడికి వెళ్ళాక అక్కడి పరిస్థితులు అతడిని షాక్కు గురిచేశాయి. ఆరోగ్య కేంద్రంలో వైద్యుడు, నర్స్ అందుబాటులో లేరు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు కైలాస్. అతని పరిస్థితి గమనించిన స్థానికులు మరొకసారి అంబులెన్స్కు ఫోన్ చేశారు. ఈ సారి అదృష్టవశాత్తు అంబులెన్స్ వచ్చింది. దీంతో వెంటనే ఆలస్యం చేయకుండా వెంటనే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తీసుకువెళ్లారు. అక్కడ బాధితురాలిని పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని జిల్లా ఆస్పత్రికి తీసుకు వెళ్లాలని సూచించారు. చివరకు జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అధికారుల వద్దకు వీడియో చేరడంతో వారు తీవ్రంగా స్పందించారు జిల్లా మెడికల్ ఆఫీసర్ పూర్తి సమగ్ర విచారణ చేపడతామని వెల్లడించారు.