సిసోడియాను ఎక్కువకాలం నిర్బంధంలో ఉంచడానికే తప్పుడు కేసులు.. : కేంద్రంపై కేజ్రీవాల్ ఫైర్
New Delhi: ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్ నాయకుడు మనీష్ సిసోడియాపై సీబీఐ మరో కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆయనను అరెస్ట్ చేయగా, తాజాగా స్నూపింగ్ ఆరోపణల కేసుకు సంబంధించి సిసోడియాతో పాటు మరో ఏడుగురిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదుచేసింది.
Delhi Chief Minister Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి కేంద్రంలోని బీజేపీ సర్కారును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. సిసోడియాపై అనేక తప్పుడు కేసులు బనాయించి నిర్భంధంలో ఉంచాలని మోడీ సర్కారు యోచిస్తోందని విమర్శించారు.
వివరాల్లోకెళ్తే.. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తాజాగా అవినీతి కేసు నమోదు చేసింది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో కేసు నమోదుచేసిన సీబీఐ ఆయనను అరెస్టు చేసింది. తాజాగా స్నూపింగ్ ఆరోపణల కేసుకు సంబంధించి సిసోడియాతో పాటు మరో ఏడుగురిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. సిసోడియాపై అనేక తప్పుడు కేసులు బనాయించి, ఆయనను సుదీర్ఘకాలం నిర్బంధంలో ఉంచాలని మోడీ యోచిస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు.
"మనీష్ సిసోడియాపై అనేక తప్పుడు కేసులు బనాయించి సుదీర్ఘకాలం కస్టడీలో ఉంచాలన్నది ప్రధాని ప్లాన్. ఇది దేశానికి బాధగా ఉంది !.." అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
కాగా, మనీష్ సిసోడియాపై నమోదుచేసిన రెండో కేసు ఇది. ఇదివరకు ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదుచేసి, అదుపులోకి తీసుకుంది సీబీఐ. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు. తాజా కేసు 2015 లో ఆప్ ప్రత్యర్థులు, ప్రభుత్వ అధికారులపై చట్టవిరుద్ధంగా గూఢచర్యం చేసిన 'ప్రత్యేక ఫీడ్ బ్యాక్ యూనిట్'ను సృష్టించిందనే ఆరోపణలను ప్రస్తావిస్తూ సీబీఐ కేసు నమోదుచేసింది. 'ఫీడ్ బ్యాక్ యూనిట్' కేసులో సీబీఐ ఎఫ్ ఐఆర్ లో మరో ఐదుగురి పేర్లు కూడా ఉన్నాయి. వారిలో సుఖేష్ కుమార్ జైన్, 1992 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి, అప్పటి ఢిల్లీ ప్రభుత్వంలో విజిలెన్స్ కార్యదర్శి; కేజ్రీవాల్ ప్రత్యేక సలహాదారు, యూనిట్ జాయింట్ డైరెక్టర్ గా ఉన్న సీఐఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (రిటైర్డ్) రాకేశ్ కుమార్ సిన్హా, ఇంటెలిజెన్స్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్ పుంజ్, యూనిట్ డిప్యూటీ డైరెక్టర్ సీఐఎస్ఎఫ్ మాజీ అసిస్టెంట్ కమాండెంట్ సతీష్ ఖేత్రపాల్, కేజ్రీవాల్ సలహాదారు (అవినీతి నిరోధక) గోపాల్ మోహన్ లు ఉన్నారు. 'పొలిటికల్ ఇంటెలిజెన్స్' సేకరించారనే ఆరోపణలపై విజిలెన్స్ ఇంచార్జి మంత్రి సిసోడియాను ప్రాసిక్యూట్ చేయడానికి కేంద్ర హోం మంత్రి ఫిబ్రవరి 22 న సీబీఐకి అనుమతి ఇచ్చారు.
'ఫీడ్ బ్యాక్ యూనిట్ కేసు' అంటే ఏమిటి?
2015 లో ఢిల్లీలో ఆప్ తన మొదటి పూర్తి పదవీకాలాన్ని గెలుచుకున్న వెంటనే.. కొత్త ప్రభుత్వం 'వివిధ శాఖలు, స్వయంప్రతిపత్తి సంస్థలు సహా వివిధ సంస్థలపై పనీతీరును గురించిన ఫీడ్ బ్యాక్ సేకరించడానికి, అవినీతి కేసులను దర్యాప్తు చేయడానికి ఒక 'ఫీడ్ బ్యాక్ యూనిట్'ను ఏర్పాటు చేసింది. అప్పటి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నుంచి ఎలాంటి క్యాబినెట్ నోట్ ను ప్రవేశపెట్టలేదనీ, అనుమతి తీసుకోలేదని సీబీఐ ఆరోపించింది. ఈ పోస్టులకు ఎలాంటి రిక్రూట్ మెంట్ రూల్స్ రూపొందించలేదనీ, జంగ్ అనుమతి లేకుండానే 17 మంది రిటైర్డ్ సిబ్బందిని రిక్రూట్ చేసుకున్నారని సీబీఐ ఆరోపించింది.
సీక్రెట్ ఎక్స్పెండిచర్ ఫండ్ నుంచి రూ.కోటి బడ్జెట్ తో 2016 ఫిబ్రవరిలో ఈ యూనిట్ కార్యకలాపాలు ప్రారంభించిందనీ, ఎనిమిది నెలల్లో 700 కేసులను దర్యాప్తు చేశామనీ, వీటిలో కనీసం 40 శాతం రాజకీయ సమాచారాన్ని సేకరించడం, గూఢచర్యానికి సంబంధించినవని సీబీఐ పేర్కొంది.