ఈదురు గాలుల బీభత్సం.. అమాంతం నేలకూలిన మొబైల్ టవర్.. ఎక్కడంటే ? (వీడియో)
రాజస్థాన్ లో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. నాగౌర్ జిల్లాలో ఏకంగా ఓ మొబైల్ టవర్ నే నేలమట్టం చేశాయి. అలాగే అనేక జిల్లాలో పలు చెట్లు నేలకూలాయి. ఈదురుగాలులు ఆగిపోయిన అనంతరం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి.
ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి బలమైన ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. ఈ శక్తివంతమైన గాలుల వల్ల ఇళ్లు, దేవాలయాలు, ఇతర మౌలిక సదుపాయాలు కూడా దెబ్బతింటున్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లాలో సంభవించిన పెను తుపాను ఓ మొబైల్ టవర్ ను నేలమట్టం చేసింది. కొన్ని నిమిషాల వ్యవధిలోనే అంత పెద్ద టవర్ నేలకూలింది.
పాకిస్థాన్ ను కూడా హిందూ దేశంగా మారుస్తాం - బాగేశ్వర్ ధామ్ ధీరేంద్ర శాస్త్రి
నాగౌర్ జిల్లాలో తీవ్ర తుపాను వస్తుందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. అయితే ఇంత భారీ స్థాయిలో ఈదురు గాలులు వీస్తాయని ఎవరూ ఊహించలేదు. ఈ బలమైన గాలి వల్ల బద్లీ రోడ్డులోని రియాసీ ప్రాంతంలో ఉన్న సెల్ ఫోన్ టవర్ ఒక్క సారిగా కూలిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.
మొబైల్ టవర్ కూలిపోవడంతో ఆ ప్రాంతంలో పెద్ద శబ్దం వచ్చింది. అనంతరం పోలీసులు, మున్సిపల్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అయితే ఈ మొబైల్ టవర్ నేలకూలడం వల్ల ఎవరికీ గాయాలు కాలేదు. అలాగే ఇతర ఆస్తులకు నష్టం వాటిళ్లలేదు. టవర్ నేల కూలిన అనంతరం ఉరుములు, మెరుపులతో కూడి భారీ వర్షం కురిసింది.
ఈ బలమైన ఈదురుగాలుల ప్రభావం మధ్యప్రదేశ్ లోనూ కనిపించింది. ఆ రాష్ట్రంలోని ఉజ్జయిని పాటు పలు నగరాల్లో ఆదివారం రాత్రి ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడ్డాయి. ఆయా ఘటనల్లో ముగ్గురు చనిపోయారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఉజ్జయిని నగరంలో ఉన్న మహాకాల్ లోక్ ఆలయ కారిడార్ లో పలు విగ్రహాలు ధ్వంసమయ్యాయి. అదే నగరంలో చెట్టు కూలి ఒకరు, నాగాడలో కచ్చా ఇంటి గోడ కూలి మరొకరు మరణించారు. ఇదే జిల్లాలో మరో ముగ్గురు గాయపడ్డారు. ఈదురుగాలుల వల్ల సుమారు 50 చెట్లు, పలు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
ఆదివారం సెలవు దినం కావడంతో మహాకాల్ లోక్ టెంపుల్ కారిడార్ ను వేల సంఖ్యలో భక్తులు సందర్శించారు. అయితే ఈ గాలి వాన బీభత్సం సృష్టించేటప్పుడు ఈ ప్రాంగణంలో సుమారు 25 వేల మంది భక్తులు ఉన్నారు. ఈ ఈదురుగాలుల వల్ల మహాకాల్ లోక్ టెంపుల్ కారిడార్ లో ఏడు సప్తర్షి విగ్రహాల్లో ఆరు విగ్రహాలు ధ్వంసమయ్యాయి. అయితే ఎవరికి గాయాలుకాకపోవడంతో అక్కడి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
ఈ మహాకాల్ లోక్ టెంపుల్ కారిడార్ ను 2022 అక్టోబర్ లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. మహాకాల్ లోక్ లో 155 విగ్రహాలు ఉన్నాయి. అయితే ఈ గాలివానకు దెబ్బతిన్న విగ్రహాలకు కాంట్రాక్టర్ మరమ్మతులు చేస్తారని అధికారులు తెలిపారు. ఈ ఆరు విగ్రహాల్లో రెండింటిని పీఠాల నుంచి పూర్తిగా తొలగించారు. ఈ విగ్రహాలు అయిదేళ్ల కాలపరిమితి ఉందని, వాటిని రూపొందించిన సంస్థ మళ్లీ విగ్రహాలను తయారు చేసి వీలైనంత త్వరగా భర్తీ చేస్తుందని కలెక్టర్ కుమార్ పురుషోత్తం తెలిపారు.