దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న కేంద్రం.. పార్లమెంట్ లో విపక్షాల నిరసనలు
Parliament: దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేయడాన్ని నిరసిస్తూ పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు నిరసనకు దిగాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు, ప్రతిపక్ష నేతలపై సమన్లు చేయడంపై లోక్సభ, రాజ్యసభ రెండింటిలోనూ కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.
Opposition protests: పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు, ప్రతిపక్ష పార్టీల మధ్య పొలిటికల్ వార్ హీట్ పెంచుతోంది. ముఖ్యంగా ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి సర్కారు ప్రతిపక్ష పార్టీల లక్ష్యంగా చేసుకుని రాజకీయ ప్రతీకారంతో దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటున్నదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేయడాన్ని నిరసిస్తూ పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు నిరసనకు దిగాయి. రాజకీయ ప్రత్యర్థులపై ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించిన ప్రతిపక్ష సభ్యుల నిరసనలకు గురువారం పార్లమెంటు ఉభయ సభలు సాక్షిగా నిలిచాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు, ప్రతిపక్ష నేతలపై సమన్లు చేయడంపై లోక్సభ, రాజ్యసభ రెండింటిలోనూ కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.
రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా Enforcement Directorate (ED) దుర్వినియోగంపై విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో లోక్సభ కార్యకలాపాలు మొదట మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. కాంగ్రెస్ సభ్యులు ఈడీ దుర్వినియోగం ఆరోపణలను లేవనెత్తడానికి ప్రయత్నించారు. అయితే రాజ్యసభ ఛైర్మన్ ఎం. వెంకయ్యనాయుడు సంబంధిత అంశాలు టేబుల్పైకి చేరిన తర్వాత వాటిని వింటానని చెప్పారు. పత్రాలు వేసిన తర్వాత, రూల్ 267 కింద తనకు ఐదు నోటీసులు వచ్చాయని, అయితే ఏదీ అంగీకరించలేదని, సమస్యలు ఏ రూపంలోనైనా లేవనెత్తవచ్చు కాబట్టి వాటిని అంగీకరించడం లేదని వెంకయ్య నాయుడు చెప్పారు. ఈడీ దుర్వినియోగంపై విపక్షాల బెంచ్లు నిరసన వ్యక్తం చేయడంతో రాజ్యసభ మొదట మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. చైర్మన్ అనుమతి ఇవ్వడంతో.. విచారణ సంస్థలను అణిచివేసేందుకు ప్రతిపక్షాలపై దుర్వినియోగం చేస్తున్నారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఖర్గే వ్యాఖ్యలను ట్రెజరీ బెంచ్ల సభ్యులు వ్యతిరేకించడంతో ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
అంతరాయం కొనసాగడంతో చైర్మన్ రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమైనప్పుడు, ప్రధానమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షాల పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ పరిస్థితుల మధ్య ప్రశ్నోత్తరాల సమయం జరిగింది. సభ జరుగుతున్నప్పుడు మధ్యాహ్నం 12.30 గంటలకు ఏజెన్సీ ముందు హాజరుకావాలని ఈడీ నుంచి తనకు సమన్లు అందాయని ఖర్గే తెలిపారు. "నేను చట్టాన్ని గౌరవిస్తాను. చట్ట అమలు సంస్థ ముందు హాజరవుతాను" అని ఖర్గే చెప్పారు. చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు తమ పని తాము చేసుకుపోతున్నాయని, ప్రస్తుత ప్రభుత్వం వాటి పనితీరులో జోక్యం చేసుకోవడం లేదని రాజ్యసభలో సభాపక్ష నేత పీయూష్ గోయల్ అన్నారు. నినాదాల మధ్య ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు భోజన విరామం కోసం వాయిదా పడింది. భోజనం తర్వాత, ప్రతిపక్ష సభ్యుల నిరంతర నినాదాల మధ్య రాజ్యసభ 'కుటుంబ న్యాయస్థానాల (సవరణ) బిల్లు, 2022'ను వాయిస్ ఓటుతో ఆమోదించింది. బిల్లు ఆమోదం పొందిన వెంటనే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు.