మహారాష్ట్రలోని సతారాలో టెంపో బోల్తా.. 40 మంది కూలీలకు గాయాలు..
మహారాష్ట్రలోని సతారా జిల్లాలో కూలీలను తరలిస్తున్న టెంపో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40 మంది కూలీలకు గాయాలు అయ్యాయి. ఇందులో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. వారిని హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.
పశ్చిమ మహారాష్ట్రలోని సతారా జిల్లాలో రోడ్డు ఘోర ప్రమాదం జరిగింది. ఓ టెంపో బోల్తా పడటంతో 40 మంది కూలీలకు గాయాలు అయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదు. ఈ ఘటన ఉదయం 9 గంటల ప్రాంతంలో జరిగింది.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు. ‘‘మహాబలేశ్వర్, తపోలా మధ్య ఘాట్ (కొండ) విభాగంలో కూలీలను రవాణా చేస్తున్న టెంపో బోల్తా పడింది. మొత్తం 40 మంది కూలీలకు గాయాలు అయ్యాయి. ఇందులో ఇద్దరు పిల్లలు ఉన్నారు.’’ అని మహాబలేశ్వర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్కె భగవత్ తెలిపారు. క్షతగాత్రుల్లో చాలా మందికి స్వల్ప గాయాలయ్యాయని ఆయన పేర్కొన్నారు. గాయపడిన ఇద్దరు చిన్నారులను సతారా సివిల్ ఆసుపత్రికి తరలించామని ఆయన తెలిపారు.
రెండు రోజుల కిందట జార్ఖండ్లోని సరైకేలా-ఖర్సావాన్ జిల్లాలో కూడా ఇలాంటి ప్రమాదమే చోటు చేసుకుంది. కూలీలు ప్రయాణిస్తున్న ఒక పికప్ వ్యాన్ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
రాజ్నగర్-చైబాసా రహదారిపై 30 మంది కూలీలతో వెళ్తున్న పికప్ వ్యాన్ ఖైర్బాని గ్రామ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మహిళలు సహా ఏడుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, డజను మంది కూలీలు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాజ్నగర్ కమ్యూనిటీ సెంటర్కు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే రాజ్నగర్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
2024 లోక్సభ ఎన్నికలపై నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ కామెంట్.. ప్రాంతీయ పార్టీలపై ఆయన అభిప్రాయమిదే
ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, దాదాపు 30 మంది కార్మికులతో వేగంగా వచ్చిన వ్యాన్ చైబాసా నుండి జంషెడ్పూర్ వైపు వెళుతుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. ఈ క్రమంలోనే వాహనం బోల్తా కొట్టింది. గాయపడిన వారందరినీ మొదట రాజ్ నగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు. అయితే, గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం జంషెడ్ పూర్ కు రిఫర్ చేశారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. 'సెరైకెలా-ఖర్సవాన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడం చాలా బాధాకరం. మరణించిన వారి ఆత్మలకు భగవంతుడు శాంతిని ప్రసాదించాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ నష్టాన్ని భరించే శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని పేర్కొంటూ ఆయన ట్వీట్ చేశారు.
శుక్రవారం కూడా మహారాష్ట్రలోని వావీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పతారే గ్రామ పరిధిలోని నాసిక్-షిర్డీ హైవేపై ట్రక్కు, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. ఇందులో ఏడుగురు మహిళలున్నారు. ఈ ప్రమాదంలో మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం విషయం తెలిసిన వెంటనే సీనియర్ పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి చేరకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.