ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కార్యాలయంలో సీబీఐ సోదాలు.. వారికి స్వాగతం అంటూ ట్వీట్ చేసిన ఆప్ నేత..
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కార్యాలయంలో సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్(సీబీఐ) అధికారులు సోదాలు చేపట్టారు.

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కార్యాలయంలో సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్(సీబీఐ) అధికారులు సోదాలు చేపట్టారు. ఢిల్లీ సెక్రటేరియట్లోని మనీష్ సిసోడియా కార్యాలయంలో ఈ సోదాలు జరుగుతున్నట్టుగా ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎక్సైజ్ పాలసీలో అక్రమాలకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సీబీఐ ఈరోజు మళ్లీ తన కార్యాలయానికి వచ్చిందని మనీష్ సిసోడియా ట్వీట్ చేశారు.
‘‘ఈరోజు మళ్లీ సీబీఐ నా కార్యాలయానికి చేరుకుంది. వారికి స్వాగతం. వారు నా ఇంటిపై దాడి చేశారు, నా కార్యాలయంపై దాడి చేశారు. నా లాకర్ను సోదా చేశారు. మా గ్రామంలో విచారణ కూడా నిర్వహించారు. నాకు వ్యతిరేకంగా ఏమీ కనుగొనబడలేదు. నేనేమీ తప్పు చేయలేదు కాబట్టి ఏమీ దొరకదు. ఢిల్లీ పిల్లల చదువు కోసం నేను చిత్తశుద్ధితో కృషి చేశాను’’ అని మనీస్ సిసోడియా ట్వీట్లో పేర్కొన్నారు.
ఇక, ఆరోపించిన ఎక్సైజ్ కుంభకోణంపై సీబీఐ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గతేడాది సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మనీష్ సిసోడియా సహా పలువురిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు మనీష్ సిసోడియాను గతేడాది ప్రశ్నించారు. అలాగే మనీష్ సిసోడియా అధికారిక నివాసంలో సోదాలు కూడా నిర్వహించారు.