తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు.. .హైదరాబాద్ కు అమిత్ షా
Hyderabad: కేంద్రంలోని బీజేపీ సర్కారు సెప్టెంబర్ 14ను తెలంగాణ విమోచనదినంగా జరుపుతోంది. ఆ రోజున భారీ బహిరంగ సభతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమాల్లో బీజేపీ అగ్రనేతలు పాలుపంచుకోనున్నారని సమాచారం.
Telangana Liberation Day: తెలంగాణ చరిత్రలో ఎంతో ప్రత్యేక ఉన్న సెప్టెంబర్ 17ను అన్ని రాజకీయ పార్టీలు టార్గెట్ చేశాయి. ఆ రోజున పోటీపడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రంలోని బీజేపీ సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినంగా జరపడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమాల్లో బీజేపీ అగ్రనేతలు పాలుపంచుకోనున్నారని సమాచారం. కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ఈ కార్యక్రమంలో భాగం కానున్నారు. తాజాగా రాష్ట్రంలో ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. శుక్రవారం సాయంత్రం షా హైదరాబాద్ కు రానున్నారు. రాత్రి 9.50 గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని శుక్రవారం రాత్రి నేషనల్ పోలీస్ అకాడమీలో బస చేస్తారు.
అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఇదే..
శనివారం ఉదయం 8.45 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్కు చేరుకున్న షా 11.45 గంటల వరకు పరేడ్ గ్రౌండ్స్లో ఉంటారు. కేంద్ర ప్రభుత్వ 'విమోచన దినోత్సవం' వేడుకల్లో భాగంగా ఆయన జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం నగరంలోని టూరిజం ప్లాజాలో పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు సికింద్రాబాద్లోని క్లాసిక్ గార్డెన్స్కు వెళ్లి, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని వికలాంగులకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి చేతుల మీదుగా పనిముట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పోలీసు అకాడమీకి వెళ్లి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదే రోజు రాత్రి 7.30 గంటలకు షా న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.
హైదరాబాద్లో మహిళల బైక్ ర్యాలీ
గురువారం భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో 'హైదరాబాద్ విమోచన దినోత్సవం' ఉత్సవాలను చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి దేవాలయం నుండి మహిళా బైక్ ర్యాలీతో ప్రారంభించారు. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పాల్గొన్నారు. బీజేపీ మహిళా విభాగానికి చెందిన పలువురు మహిళా కార్యకర్తలు కాషాయ దుస్తులు ధరించి 431 ఏళ్ల నాటి స్మారక చిహ్నం దగ్గర గుమిగూడారు. 'హైదరాబాద్ విమోచన దినోత్సవం' దృష్ట్యా కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతా కృష్ణ మూర్తి ఈ ర్యాలీని ప్లాన్ చేశారు.
పొలిటికల్ మైలేజ్ కోసం బీజేపీ ప్రయత్నిస్తోందా?
చారిత్రక సంఘటనలను రాజకీయంగా మైలేజ్ పొందడాదనికి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17 నుండి 'హైదరాబాద్ విమోచన దినోత్సవం' గుర్తుగా ఏడాది పొడవునా 'వేడుకలను' నిర్వహించనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా దాని కోసం హైదరాబాద్ వస్తున్నారు. ఆ తేదీన 1948లో హైదరాబాద్ సంస్థానం అధినేత నిజాం ఉస్మాన్ అలీఖాన్ రాజ్యం భారత దేశంలో విలీనమైంది. ఈ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ పక్కా ప్లాన్ తో ముందుకు కదులుతున్నదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎందుకంటే వచ్చే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రానికి.. ప్రజలతో ముడిపడి ఉన్న ప్రతిఅంశాన్ని బీజేపీ ఉపయోగించుకోవాలని ప్రణాళికలు చేసినట్టు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.