జీహెచ్ఎంసీ ఉద్యోగులు నిరసనలు.. ఉద్యోగ భద్రత, పెండింగ్ వేతనాలకు డిమాండ్
Hyderabad: పారిశుధ్య కార్మికులను పర్మినెంట్ ఉద్యోగులుగా చేయాలనీ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రావాల్సిన జీతాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జీహెచ్ఎంసీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.
GHMC union employees stage protest: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( జీహెచ్ఎంసీ )కి చెందిన యూనియన్ ఉద్యోగులు గురువారం కోటిలోని పౌరసరఫరాల సంస్థ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. పారిశుధ్య కార్మికులను పర్మినెంట్ ఉద్యోగులుగా చేయాలని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. వందల మంది ఉద్యోగులు ఈ నిరసనల్లో పాలుపంచుకున్నారు. ప్రభుత్వం వెంటనే తమకు ఉద్యోగ భద్రత, పెండింగ్ వేతనాల విషయంపై డిమాండ్ చేశారు. ప్రభుత్వం దీనిపై స్పందించాలని కోరారు. ప్రతినెలా పౌరసరఫరాల సంస్థ అద్దెకు ఇచ్చే బయోమెట్రిక్ హాజరు యంత్రాలను జీహెచ్ఎంసీ కొనుగోలు చేయాలని యూనియన్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. బయోమెట్రిక్ యంత్రాలు నాసిరకంగా ఉన్నాయనీ, హాజరు నమోదు తప్పుగా ఉందని, ఫలితంగా జీతంలో అన్యాయమైన కోత ఏర్పడిందని వారు పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( జీహెచ్ఎంసీ )కి చెందిన యూనియన్ ఉద్యోగులు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్లకు పలుమార్లు లేఖలు అందించినా ఫలితం లేకుండా పోయిందని ఉద్యోగులు వాపోయారు. ''ప్రభుత్వం పట్టించుకోలేదు. 700-800 మందిని తొలగించారు, వారికి జీతాలు చెల్లించలేదు”అని GHMC యూనియన్ నాయకుడు గోపాల్ అన్నారు. ‘‘మమ్మల్ని దేవుళ్లతో పోలుస్తూ జీహెచ్ఎంసీని ప్రభుత్వం మెచ్చుకుంటుంది. కానీ వారు మా బాధను పట్టించుకోవడం లేదు. వారు రామ్కీ (పౌర మౌలిక సదుపాయాల దిగ్గజం) వంటి కంపెనీని తీసుకువచ్చారు. దీని ఫలితంగా వందలాది మంది GHMC కార్మికులను తొలగించారు. పారిశుధ్యం, నిర్మాణ కాంట్రాక్టులు రాంకీ లాంటి ప్రైవేట్ కంపెనీకి అప్పగిస్తే తాము ఎలా బతకాలి? అని ఆయన ప్రశ్నించారు.
ఔట్సోర్సింగ్ జీహెచ్ఎంసీ ఉద్యోగులను పర్మినెంట్ ఉద్యోగులను చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని గోపాల్ గుర్తు చేశారు. “అయితే ఉన్న ఉద్యోగాలను మీరు తీసేస్తున్నారు. ఇది ఎలా న్యాయము?" అయన ప్రశ్నించారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమస్యను పరిష్కారం చూపాలని కోరారు. అప్పటివరకు తమ నిరసన తెలుపుతామని పేర్కొన్నారు.