ముంబయిలో జాగింగ్ చేస్తున్న ఓ టెక్ కంపెనీ సీఈవో ప్రమాదానికి గురైంది. వెనుక నుంచి ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో గాల్లోకి ఎగిరిపడ్డ ఆ సీఈవో స్పాట్లోనే మరణించింది.
న్యూఢిల్లీ: ఆమెకు ఉదయం జాగింగ్కు వెళ్లడం అలవాటు. తనను తాను ఒక ఫిట్నెస్ ఫ్రీక్ అని ప్రకటించుకునేది. ముంబయిలో ఓ టెక్నాలజీ కంపెనీకి ఆమె సీఈవో. ఎప్పటిలాగే ఆదివారం ఉదయం జాగింగ్కు వెళ్లింది. కానీ, వెనుక నుంచి ఓ కారు ఆమెను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆమె స్పాట్లోనే మరణించింది. ఈ ఘటన ముంబయిలో వర్లీ- బాంద్రా సీ లింక్కు కొన్ని మీటర్ల దూరంలో చోటుచేసుకుంది.
మరణించిన మహిళను 38 ఏళ్ల రాజలక్ష్మి రామ క్రిష్ణన్గా పేర్కొన్నారు. ముంబయిలోని శివాజీ పార్క్ నుంచి వచ్చే జాగర్స్ గ్రూప్లో ఆమె కూడా ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ యాక్సిడెంట్ ఉదయం 6.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుందని వర్లీ పోలీసులు తెలిపారు.
Also Read: టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం కేసు నిందితులకు బెదిరింపు: కేటీఆర్ పీఏపై రేవంత్ ఆరోపణలు
రాజలక్ష్మి రామ క్రిష్ణన్ జాగింగ్ చేస్తుండగా టాటా నెక్సాన్ ఈవీ కారు వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టింది. ఎంత వేగంగా ఢీకొట్టిందంటే.. రాజలక్ష్మి గాల్లోకి ఎగిరి పక్కనే ఉన్న వీధిలో పడింది. వెంటనే ఆమెను నాయర్ హాస్పిటల్ తీసుకెళ్లారు. కానీ, అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు డిక్లేర్ చేశారు.
టాటా నెక్సాన్ ఈవీ కారును అప్పుడు నడుపుతున్న వ్యక్తిగా 23 ఏళ్ల సుమెర్ మర్చంట్గా గుర్తించారు. పోలీసులు సుమెర్ మర్చంట్ను అరెస్టు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. రాజలక్ష్మికి తల, పుర్రె భాగంలో తీవ్ర గాయాలు అయినట్టు తెలిపారు.
