ఏపీకిచ్చిన హామీలను మోడీ గంగలో కలిపారు: తోట నరసింహం
అబద్దాలతో ఏపీ ప్రజలను ఎంతో కాలం మోసం చేయలేరని టీడీపీ ఎంపీ తోట నరసింహం లోక్సభలో కేంద్రం తీరుపై ధ్వజమెత్తారు. ఏపీ ప్రజల మనోభావాలను పట్టించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ: అబద్దాలతో ఏపీ ప్రజలను ఎంతో కాలం మోసం చేయలేరని టీడీపీ ఎంపీ తోట నరసింహం లోక్సభలో కేంద్రం తీరుపై ధ్వజమెత్తారు. ఏపీ ప్రజల మనోభావాలను పట్టించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
బుధవారం నాడు లోక్సభ జీరోఅవర్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని టీడీపీ ఎంపీ తోట నరసింహం కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వారణాసి నుండి ఎంపీగా ఎన్నికైన మోడీ ఏపీ ప్రజలకు ఇచ్చిన హమీలను గంగలో కలిపేశారని ఆయన విమర్శించారు.
ఏపీ పట్ల కేంద్రం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. అవిశ్వాసం సందర్భంగా ప్రధానమంత్రి మోడీ రాజకీయ ఉపన్యాసం చేశారని ఆయన విమర్శించారు. ఏపీ ప్రజలతో కేంద్రం ఆటలాడుతోందన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకూడదని 14వ, ఆర్థిక సంఘం ఏనాడూ చెప్పలేదనే విషయాన్ని ఆయన సభలో ప్రస్తావించారు.ఒకవేళ 14వ, ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వకూడదని చెబితే ఆ విషయాన్ని నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎన్నికల సమయంలో ఏపీలో జరిగిన పలు సభల్లో మోడీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చిన హమీని ఆయన గుర్తు చేశారు.అంతేకాదు చట్టసభల్లో ఇచ్చిన హమీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.