32 ఏళ్ల నాటి కేసులో సంచలన తీర్పు .. దోషికి 383 ఏండ్ల జైలు శిక్ష.. రూ.3.2 కోట్ల జరిమానా..
35 ఏండ్ల నాటి ఓ కేసులో కోయంబత్తూర్ న్యాయస్థానం దోషికి 383 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ప్రభుత్వ బస్సులను వేలంలో అక్రమాలకు పాల్పడంటూ జైలు శిక్షతో పాటు రూ. 3.32 కోట్ల జరిమానాను విధించింది. ఒకవేళ ఫైన్ చెల్లించకపోతే అదనంగా మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చింది.

35 ఏండ్ల నాటి ఓ కేసులో కోయంబత్తూర్ న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరిచింది. ఓ దోషికి ఏకంగా 383 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ప్రభుత్వ బస్సులను వేలంలో అక్రమాలకు పాల్పడంటూ జైలు శిక్షతో పాటు రూ. 3.32 కోట్ల జరిమానాను విధించింది. ఒకవేళ ఫైన్ చెల్లించకపోతే అదనంగా మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చింది.
అసలేం జరిగింది.
తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలోని కోయంబత్తూర్ డివిజన్లో బస్సుల వేలంలో అక్రమాలు జరిగాయంటూ నవంబర్ 9, 1988న కేసు ఫిర్యాదు నమోదైంది. సంస్థకు చెందిన 47 బస్సులపై నకిలీ పత్రాలు సృష్టించి విక్రయించారంటూ ఉన్నతాధికారులు ఆరోపణలు వచ్చాయి. దాదాపు రూ.28 లక్షలు మోసం చేశారంటూ.. 8 మంది ఉద్యోగులపై కేసు నమోదైంది.
ఆ క్రమంలో చేరన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అసిస్టెంట్ కోదండపాణి, డిప్యూటీ మేనేజర్ రామచంద్రన్, నాగరాజన్, నటరాజన్, మురుగనాథన్, దురైసామీ, రంగనాథన్, రాజేంద్రన్ లపై ఆర్ఎస్ పురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆడిట్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అప్పటి సీటీసీ జనరల్ మేనేజర్ ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి.. అంటే గత 35 ఏళ్లుగా ఈ కేసు కోయంబత్తూర్ ఫస్ట్ అడిషనల్ సబార్డినేట్ కోర్టులో విచారణ జరుగుతోంది.
ఈ కేసు విచారణలో ఉండగానే రామచంద్రన్, నటరాజన్, రంగనాథన్, రాజేంద్రన్ మృతిచెందారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి తీర్పును శుక్రవారం వెలువరించింది న్యాయస్థానం. కోదండపాణి మినహా మిగిలిన ముగ్గురిని నిర్దోషులుగా న్యాయమూర్తి శివకుమార్ విడుదల చేశారు. గోదాండపాణిపై 3 సెక్షన్ల కింద అభియోగాలు రుజువైనట్లు న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.
అమానత్లోని ఖయానత్ సెక్షన్ కింద 47 నేరాలకు 4 ఏళ్ల చొప్పున 188 ఏళ్లు, దీనితో పాటు ఫోర్జరీ సెక్షన్ కింద 47 నేరాలకు గాను 4 ఏళ్ల చొప్పున 188 ఏళ్లు, ప్రభుత్వ ఆస్తులను అపహరించినందుకు ఏడు సంవత్సరాల జైలు శిక్షను విధించింది. ఈ మూడు శిక్షల మొత్తం కలిపితే 383 ఏండ్ల జైలు శిక్ష విధించింది. అయితే..దోషి వయసును దృష్టిలో పెట్టుకుని శిక్షను ఏకకాలంలో పూర్తి చేయాలని ఆదేశించింది. దీంతో పాటు రూ.3.32 కోట్ల జరిమానాను విధించింది. ఒకవేళ ఫైన్ చెల్లించకపోతే మరో ఏడాది జైలు శిక్ష అదనంగా వేయాలని తీర్పునిచ్చింది.