తమిళనాడు వదిలివెళ్లండని నినాదాలు.. అసెంబ్లీ నుంచి గవర్నర్ ఆర్ఎన్ రవి వాకౌట్
తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ ఆర్ఎన్ రవికి తీవ్ర నిరసన సెగ ఎదురైంది. గవర్నర్ ప్రసంగానికి సంబంధించి పెద్ద రభస జరిగింది. దీంతో గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.పెరియార్, అంబేద్కర్,సెక్యులరిజం వంటి రెఫరెన్సులను గవర్నర్ స్కిప్ చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని మాత్రమే ఆన్ రికార్డులో ఉంచాలని సీఎం స్పీకర్ను కోరారు. ఆ తర్వాత గవర్నర్ వాకౌట్ చేశారు.
చెన్నై: తమిళనాడులో డీఎంకే ప్రభుత్వానికి గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య దూరం పెరుగుతున్నది. ఆయన బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ఇక్కడ రుద్దే ప్రయత్నం చేస్తున్నారని, రాష్ట్ర బీజేపీ యూనిట్కు రెండో అధ్యక్షుడిగా ఉన్నారని అధికార పక్ష నేతల నుంచి గత కొంతకాలంగా విమర్శలు వస్తున్నాయి. ఇటీవలే ఆయన తమిళనాడు పేరు మార్చాలని చేసిన సూచన, గత 50 ఏళ్లుగా ద్రవిడులమని చెప్పి తిరోగమన రాజకీయాలు చేస్తున్నారని డ్రవిడియన్ పార్టీలపై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. తాజాగా, అసెంబ్లీలోనూ ఈ విభేదాలు బయటపడ్డాయి. చివరకు గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.
అసెంబ్లీలో సాంప్రదాయంగా గవర్నర్ చేసే ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని మాత్రమే ఆన్ రికార్డులో ఉంచాలని, గవర్నర్ చేర్చిన వ్యాఖ్యలను తొలగించాలని సీఎం ఎంకే స్టాలిన్ స్పీకర్ను కోరారు. దీంతో గవర్నర్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి ఇచ్చిన గవర్నర్ ఒరిజిన్ స్పీచ్ మాత్రమే రికార్డ్ చేయాలని అసెంబ్లీలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగంలో నుంచి సెక్యులరిజం, కొందరు నాయకులు పెరియార్, బీఆర్ అంబేద్కర్, కే కామరాజ్, సీఎన్ అన్నాదురై, కరుణానిధి వంటి పేర్లను సూచించే రిఫరెన్సులను గవర్నర్ స్కిప్ చేశారు. గవర్నర్ ఆర్ఎన్ రవి తన ప్రసంగంలో వీటి ని స్కిప్ చేయడంతో సీఎం ఓ తీర్మానం ప్రవేశ పెట్టారు. గవర్నర్ తీరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నదని ఆ తీర్మానంలో పేర్కొన్నారు.
Also Read: తమిళనాడు బీజేపీలో అంతర్గత పోరు.. కూర్చిలతో కొట్టుకున్న నేతలు...
కీలకమైన బిల్లులను క్లియర్ చేయడంలో గవర్నర్ ఆర్ఎన్ రవి ఉద్దేశపూర్వకంగానే జాప్యం వహిస్తున్నారని డీఎంకే మిత్రపక్షాలు కాంగ్రెస్, విడుతలై చిరుతైగల్ కాచి, సీపీఐ, సీపీఎంలు అంతకు ముందు గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కాట్ చేశాయి. ఆన్లైన్ గ్యాంబ్లింగ్పై నిషేధం, రాష్ట్ర వర్సిటీలకు వైస్ చాన్సిలర్లను నియమించడంలో గవర్న్ అధికారులకు కత్తెర వేయడం వంటి బిల్లులకు ఆయన ఆమోదం తెలుపడం లేదు. అసెంబ్లీలో పాస్ అయి గవర్నర్ వద్ద సుమారు 21 బిల్లులు పెండింగ్లో ఉన్నాయి.
అంతేకాదు, అసెంబ్లీలో గవర్నర్ ఆర్ఎన్ రవికి వ్యతిరేకంగా నినాదాలు దద్దరిల్లాయి. క్విట్ తమిళనాడు అని స్లోగన్స్ ఇచ్చారు. అంతేకాదు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని ఇక్కడ దింపొద్దని డీఎంకే ఎమ్మెల్యేలు నినాదాలు ఇచ్చారు. రాష్ట్రానికి తమిళనాడుకు తమిళగం పేరు సరిగ్గా సరిపోతుందని బుధవారం గవర్నర్ చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు.