నో చాన్స్: నిర్భయ కేసు దోషి తాజా పిటిషన్ ను కొట్టేసిన సుప్రీం
తనకు క్యురేటివ్ పిటిషన్ పెట్టుకోవడానికి మరో అవకాశం ఇవ్వాలని నిర్భయ దోషి కేసుల్లో ఒక్కడైన ముకేష్ పెట్టుకున్న పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అన్ని అవకాశాలను వాడుకున్నట్లు తేల్చేసింది.
న్యూఢిల్లీ: తనకు విధించిన మరణ శిక్షకు వ్యతిరేకంగా మరోసారి క్యురేటివ్ పిటిషన్ ను దాఖలు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని నిర్భయ కేసు దోషుల్లో ఒక్కడైన ముకేష్ సింగ్ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మకేష్ సింగ్ అన్ని అవకాశాలను వాడుకున్నాడని సుప్రీంకోర్టు తేల్చేసింది.
నిర్బయ కేసు దోషులు నలుగురికి మార్చి 20వ తేదీ ఉదయం 5.30 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని పాటియాల హౌస్ కోర్టు డెత్ వారంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. నాలుగో దేషి పవన్ గుప్తా మెర్సీ పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించడంతో నలుగురు దోషులకు ఉన్న అవకాశాలన్నీ అయిపోయాయి.
Also Read: నిర్భయ కేసులో మరో ట్విస్ట్: చచ్చిపోతామని దోషుల తల్లిదండ్రుల బెదిరింపు
మరణశిక్ష అమలును వాయిదా పడే విధంగా దోషులు అక్షయ్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముకేష్ సింగ్ పిటిషన్ల మీద పిటిషన్లు దాఖలు చేస్తూ వచ్చారు. చివరకు అన్ని అవకాశాలు ముగిసిపోయాయి. ఈ స్థితిలో తాము కారుణ్య మరణం పొందడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ దోషుల తల్లిదండ్రులు రాష్ట్రపతికి లేఖ రాశారు
2012 డిసెంబర్ 16వ తేదీన కదులుతున్న బస్సులో 26 ఏళ్ల వైద్య విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు అత్యాచారం చేసి, ఆమెను చిత్రహింసలు పెట్టారు. సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది.
Also Read: క్షమాభిక్ష తిరస్కరణ ఎపిసోడ్తో కొత్త ఎత్తు: ఢిల్లీ హైకోర్టుకెక్కిన వినయ్ శర్మ
ఆరుగురిలో ఒకతను మైనర్ కావడంతో అతను మూడేళ్ల శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. ప్రధాన నిందితుడు రామ్ సింగ్ జైలులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.