ఉక్రెయిన్ మెడికల్ విద్యార్ధులకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఇతర దేశాల కాలేజీల్లో వారి చదువు కొనసాగించేలా అవకాశం కల్పించాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది
యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో వైద్య విద్యను అర్థాంతరంగా మధ్యలోనే ఆపేసి భారత్కు వచ్చేసిన విద్యార్ధులకు సుప్రీంకోర్ట్ స్వల్ప ఊరటనిచ్చింది. ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చేసిన విద్యార్ధులు ఇతర దేశాల కాలేజీల్లో చదువు కొనసాగించేలా అవకాశం కల్పించాలని సుప్రీంకోర్ట్ వ్యాఖ్యానించింది. ఇతర దేశాల్లో కాలేజీల్లో ఫీజులు, సీట్ల వివరాలు తెలిసేలా పోర్టల్ రూపొందించాలని .. ఎక్కడ చదువుకోవాలో నిర్ణయించుకునే అవకాశం విద్యార్ధులు, తల్లిదండ్రులకు కల్పించాలని సుప్రీంకోర్ట్ అభిప్రాయపడింది. ఉక్రెయిన్ విద్యార్థులంతా భారత్కు బయటే చదువుకోవాలి కాబట్టి విద్యా సంవత్సరం కోల్పోకుండా సిలబస్లో మార్పులు లేకుండా చూడాలని ధర్మాసనం సూచించింది. ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్ధులను యుద్ధ బాధితులుగా ప్రకటించాలని లాయర్లు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే తదుపరి విచారణను వచ్చే శుక్రవారం చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఇకపోతే.. ఉక్రెయిన్ నుంచి భారత్కు తిరిగొచ్చిన మెడికల్ విద్యార్ధులకు చట్టపరంగా దేశంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశం కల్పించడం సాధ్యం కాదని కేంద్రం నిన్న సుప్రీంకోర్టుకు తెలియజేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మోడీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్లో తక్కువ మార్కులు రావడం వల్లే భారతీయ విద్యార్ధులు ఉక్రెయిన్లో మెడిసిన్ చదివేందుకు వెళ్లారని కేంద్రం తన అఫిడవిట్లో పేర్కొంది. అందుచేతే వీరికి ప్రవేశాలు కల్పించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. అయితే ఉక్రెయిన్ కళాశాలల అనుమతితో విదేశాల్లో మెడికల్ డిగ్రీని పూర్తి చేసేందుకు అవకాశం కల్పిస్తామని సుప్రీంకు తెలియజేసింది. ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్ధులకు ఎన్ఎంసీ తదితర ప్రభుత్వ ఏజెన్సీలు సహకారం అందిస్తున్నాయని కేంద్రం వెల్లడించింది. శుక్రవారం ఉక్రెయిన్ విద్యార్ధుల కేసును సుప్రీంకోర్టు విచారించనున్న నేపథ్యంలో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది.
ALso REad:ఇండియాలో అడ్మిషన్లు కుదరదు.. ఉక్రెయిన్ మెడికల్ విద్యార్ధులకు మరోసారి తేల్చేసిన కేంద్రం
కాగా.. ఉక్రెయిన్ నుండి సుమారు 18 వేల మంది వైద్య విద్యార్ధులు ఇండియాకు తిరిగి వచ్చారు. పలు రాష్ట్రాల నుండి వందల సంఖ్యలో ఉక్రెయిన్ కు వెళ్లి వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఒక్క Kerala రాష్ట్రంలోనే సుమారు 3,900 మంది ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి కూడా పెద్ద సంఖ్యలో వైద్య విద్యార్ధులు ఉక్రెయిన్ లో వైద్య విద్య చదువుతున్నారు.
