‘‘మహిళలను చూడటం అయ్యప్పకు ఇష్టముండదు’’
శబరిమల ఆలయంలోకి యాభై ఏళ్ల లోపు వయసున్న మహిళల ప్రవేశాన్ని నిషేధించే ఆచారంపై దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. కులం, లింగం ఆధారంగా వివిక్ష చూపిస్తే సంప్రదాయాలనైనా కొట్టేసే అధికారం సుప్రీం కోర్టుకు ఉందని న్యాయమూర్తులు స్పష్టం చేశారు
శబరిమల ఆలయంలోకి యాభై ఏళ్ల లోపు వయసున్న మహిళల ప్రవేశాన్ని నిషేధించే ఆచారంపై దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. కులం, లింగం ఆధారంగా వివిక్ష చూపిస్తే సంప్రదాయాలనైనా కొట్టేసే అధికారం సుప్రీం కోర్టుకు ఉందని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ వివాదంపై స్పష్టమైన వివరణ ఇచ్చింది..
మతపరమైన ఆచారాలు మహిళల పట్ల వివిక్ష చూపించకుండా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ప్రభుత్వాలకు ఉందని.. ఈ అంశంపై రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, ఆర్టికల్ 25(2) నిర్దేశించాయని తెలిపారు.. మరోవైపు తాము మహిళలను గౌరవిస్తామని.. ఆలయ ఆచారాలు స్త్రీల పట్ల వివిక్ష చూపడం లేదని నాయర్ సోసైటీ తరపున వాదనలు వినిపించిన మాజీ అటార్నీ జనరల్ కె. పరాశరన్ అన్నారు.
పదేళ్ల లోపు , 50 ఏళ్ల పైన వయసున్న మహిళలను ఆలయంలోకి అనుమతినిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయ్యప్ప బ్రహ్మచారి అని... ఆయనకు 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న ఆడవారిని చూడటం అయ్యప్ప స్వామికి ఇష్టముండదని భక్తులు విశ్వసిస్తారని.. అందుకే రుతుస్రావం జరిగే వయసులో ఉన్న మహిళలను అనుమతించడం లేదన్నారు పరాశరన్ తెలిపారు.
ఆయన వాదనను విన్న సర్వోన్నత న్యాయస్థానం.. మహిళలను నియంత్రించేందుకు వివిక్ష చూపించే అధికారం ఏ మతానికీ లేదని.. రాజ్యాంగం అన్ని మతాలకు వర్తిస్తుందని తేల్చిచెప్పింది.. ఒకవేళ ఇలాంటి వివిక్ష జరిగితే ఆయా వర్గాలకు ఆలయ ప్రవేశం కల్పించేందుకు ప్రభుత్వాలకు చట్టం చేసే అధికారం ఉందని ధర్మాసనం తెలిపింది. అయితే వాదనలు కొనసాగుతున్న క్రమంలో మరో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది..
అన్ని వయసుల మహిళలను ఆలయ ప్రవేశం చేయించాలా వద్దా..? అనేది దేవప్రశ్న ద్వారా నిర్ణయం తీసుకోవాలని శబరిమల ఆలయ ప్రధాన పూజారి (తంత్రి’)సుప్రీంకోర్టుకు విన్నవించారు. గతంలో కేరళలోని పలు ఆలయాలలో మహిళలను అనుమతించడానికి దేవప్రశ్న వేశారని తెలిపారు. ఈ సమస్యకు ఇదే ఏకైక పరిష్కారమని తంత్రి న్యాయస్థానానికి తెలియజేశారు.