50 శాతం వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు.. విచారణకు సుప్రీం ఓకే
ఎన్నికల ఫలితాల్లో భాగంగా 50 శాతం వీవీ ప్యాట్ల స్లిప్పులను లెక్కించాలని 21 పార్టీలు వేసిన రివ్యూ పిటిషన్పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
ఎన్నికల ఫలితాల్లో భాగంగా 50 శాతం వీవీ ప్యాట్ల స్లిప్పులను లెక్కించాలని 21 పార్టీలు వేసిన రివ్యూ పిటిషన్పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ అంశంపై త్వరంగా విచారణ జరపాలని ప్రతిపక్షాల తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సీజేఐ ముందు ప్రస్తావించారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ ఈ పిటిషన్పై వచ్చే వారం విచారణ జరిపేందుకు అనుమతినిచ్చారు. వీవీప్యాట్ స్లిప్పుల అంశంపై దేశంలోని 21 రాజకీయ పార్టీలు కలిసి సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
అయితే వీవీప్యాట్లలో 50 శాతం స్లిప్లులు లెక్కించడం వల్ల సమయం, సిబ్బంది ఎక్కువ అవసరమవుతారని ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలిపింది.
దీంతో ప్రతి నియోజకర్గంలో ఐదు వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. అయితే దీనిని వ్యతిరేకించిన ప్రతిపక్షాలు మరోసారి సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేశాయి.