Sulur Helicopter crash: కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి
ఈ నెల 8వ తేదీన తమిళనాడు రాష్ట్రంలో హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడిన కెప్టెన్ వరుణ్ సింగ్ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించాడు.
బెంగుళూరు: ఈ నెల 8వ తేదీన తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వరుణ్ సింగ్ మరణించాడు. ఈ మేరకు ఐఎఎఫ్ కూడా వరుణ్ సింగ్ మరణాన్ని అధికారికంగా ప్రకటించింది. వరుణ్ సింగ్ మరణంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 14కి చేరింది. ఈ నెల 8వ తేదీన జరిగిన ప్రమాదంలో 13 మంది మరణించారు. ఈ ప్రమాదం నుండి తీవ్ర గాయాలతో బయటపడిన వరుణ్ సింగ్ ను మెరుగైన వైద్యం కోసం బెంగుళూరు ఆసుపత్రికి తరలించారు. సుమారు వారం రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేసిన వరుణ్ సింగ్ ఇవాళ ఉదయం ఆయన మరణించినట్టుగా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
also read:స్వగ్రామంలో లాన్స్ నాయక్ సాయితేజకు కన్నీటి వీడ్కోలు: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
ఈ నెల 8వ తేదీన హెలికాప్టర్ ప్రమాదం జరిగిన వెంటనే వెల్లింగ్టన్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ ప్రాథమికి చికిత్స నిర్వహించిన అనంతరం ఆయనను మెరుగైన వైద్యం కోసం బెంగుళూరు ఆసుపత్రికి తరలించారు. Mi-17 V5 Helicopter నీలగిరి కొండల్లో చెట్లను ఢీకొడుతూ కుప్పకూలింది. పొగ మంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందనే అనుమానాలను అధికారులు వ్యక్తం చేశారు. వారం రోజుల క్రితం బిపిన్ రావత్ ఆయన భార్య మధులిక సహా మరో 11 మంది ప్రమాదం జరిగిన వెంటనే మరణించారు. సూలూరు ఎయిర్ బేస్ నుండి వెల్లింగ్టన్ వెళ్లున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. హెలికాప్టర్ ల్యాండ్ అవడానికి ఏడు నిమిషాల ముందే ఈ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ కుప్పకూలడానికి గల కారణాలపై ఆర్మీ అధికారులు ఏర్పాటు చేసిన నిపుణుల బృందం విచారణ నిర్వహిస్తోంది. వరుణ్ సింగ్ తండ్రి కల్నల్ కెపి సింగ్ తన కొడుకును ఫటర్ గా అభివర్ణించారు. వరుణ్ సింగ్ ఆగష్టు శౌర్య చక్ర అవార్డును గెలుచుకొన్నారు. తేజాస్ యుద్ధ విమానాన్ని కూడా ఆయన సురక్షితంగా ల్యాండ్ చేసిన అనుభవం ఉంది.వరుణ్ సింగ్ మృతి చెందడంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
వరుణ్ సింగ్ మృతికి మోడీ సంతాపం
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి చెందడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. అత్యంత పరాక్రమంతో కెప్టెన్ వరుణ్ సింగ్ దేశానికి సేవ చేశాడని మోడీ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.వరుణ్ సింగ్ మృతి తనను తీవ్ర వేదనకు గురి చేసిందని ఆయన తెలిపారు.
ఇదే ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్ నాయక్ సాయితేజ కూడా మరణించాడు.ప్రమాదం జరిగిన రెండు రోజుల తర్వాత సాయితేజ మృతదేహన్ని గుర్తించారు. మృతదేహలు పూర్తిగా కాలిపోయి ఉండడంతో డిఎన్ఏ పరీక్షల ఆధారంగా సాయితేజ డెడ్బాడీని గుర్తించారు.సాయితేజ అంత్యక్రియలను స్వగ్రామం ఎగువరేగడలో సైనిక లాంఛనాలతో నిర్వహించారు.