కీచక హెడ్మాస్టర్ భరతం పట్టిన విద్యార్థినులు.. చితకబాది పోలీసులకు అప్పగించిన హాస్టల్ స్టూడెంట్లు (వీడియో)
కర్ణాటకలో ఓ కీచక హెడ్మాస్టర్కు విద్యార్థినులు బుద్ధి చెప్పారు. హాస్టల్లోని ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె తన రూమ్ మేట్లను అలర్ట్ చేసింది. వారంతా కలిసి హెడ్ మాస్టర్ భరతం పట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బెంగళూరు: కీచక ఉపాధ్యాయుల ఘటనలు చాలా చూశాం. క్లాసు రూముల్లో, హాస్టల్లో విద్యార్థినులను వేధించిన ఘటనలు కథనాలుగా చదివాం. కానీ, చాలా తక్కువ ఘటనల్లో మాత్రమే విద్యార్థినుల ప్రతిఘటనలు చూశాం. కానీ, కర్ణాటకలో ఓ కీచక హెడ్మాస్టర్కు మాత్రం విద్యార్థినుల నుంచి ప్రతిఘటన స్పష్టంగా వచ్చింది. ఒక మైనర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన హెడ్ మాస్టర్ను వారంతా కలిసి చితకబాదారు. హెడ్ మాస్టర్ భరతం పట్టి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన కర్ణాటకలో శ్రీరంగపట్నానికి చెందిన కట్టేరి గ్రామంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
కట్టేరి ప్రభుత్వ హై స్కూల్ హెడ్ మాస్టర్ చిన్మయ ఆనంద మూర్తి ఓ హాస్టల్ స్టూడెంట్ (మైనర్ బాలిక)తో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె వెంటనే ఇతర రూమ్మేట్లకు తెలిపింది. వారందరినీ అలర్ట్ చేసింది. వారంతా కలిసి హెడ్ మాస్టర్ను ఎదుర్కోవాలని డిసైడ్ అయ్యారు. ఓ వీడియోలో విద్యార్థినులంతా మూకుమ్మడిగా హెడ్ మాస్టర్ పై కర్రలతో దాడి చేశారు. వారి రూమ్ మేట్ ను వేధించినందుకు విరుచుకుపడ్డారు. ఇతర స్కూల్ స్టాఫ్, టీచర్లు వారికి సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టు మరో వీడియోలో కనిపించింది. ఆ హెడ్ మాస్టర్ పై కఠిన చర్యలు తీసుకునేలా నిర్ణయాలు తీసుకుంటామని వారు చెబుతున్నారు.
హెడ్ మాస్టర్ తనను ఒక క్లాసు రూమ్లోకి వెళ్లి దాక్కోవాలని ప్రయత్నించాడు. కానీ, కర్రలతో వెళ్లి ఆ విద్యార్థినులు ఆ చాన్స్ ఇవ్వలేదు. రూమ్లోకి దూసుకెళ్లి చితక్కొట్టినట్టు మరో వీడియో చూపించింది.
Also Read: తొమ్మిదో తరగతి విద్యార్థినితో టీచర్ అసభ్య ప్రవర్తన..కానీ, పోలీసులు ఏం చేశారంటే...
ఆ హెడ్ మాస్టర్ తరుచూ అనేకరకాల ఉల్లంఘనలకు పాల్పడేవాడని కొందరు అధికారులు చెప్పారు. గతంలోనూ పలువురు బాలికలను వేధించినట్టు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన తీవ్రం కావడంతో పోలీసులు స్పాట్కు వెళ్లారు. అతడిని అరెస్టు చేశారు. అతడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు.
కట్టేరి గ్రామానికి చెందిన వెంకటేశ్ మాట్లాడుతూ, ఆనంద మూర్తి వర్కింగ్ అవర్స్ సాయంత్రం 5 గంటలకు ముగిసిపోతాయని, కానీ, ఆయన రాత్రి 12 గంటల వరకు అక్కడే తిరుగుతూ ఉండేవాడని అన్నారు. ఇంకా హాస్టల్లో తిరుగుతున్నావని తాము ప్రశ్నిస్తే.. ఫుడ్, ఇతర విషయాల్లో సమన్వయం కోసం తానుు అక్కడే ఉన్నానని వివరించేవాడని తెలిపారు. ఇప్పుడు ఆయన ఒక విద్యార్థినితో మిస్బిహేవ్ చేశాడని పేర్కొన్నారు. స్టూడెంట్ల అరుపులు వినిపించగానే స్పాట్కు పరుగెత్తుకు వచ్చామని, గత మూడు నాలుగేళ్ల నుంచే అతను హద్దు మీరి ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు.