పశ్చిమ బెంగాల్లో వందే భారత్ ఎక్స్ప్రెస్పై రాళ్ల దాడి.. ప్రారంభించిన రెండు రోజుల్లోనే ఘటన..
పశ్చిమ బెంగాల్ లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై రాళ్ల దాడి జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ రైలును లాంఛనంగా జెండా ప్రారంభించారు. ఈ ఘటనపై ఎన్ఐఏతో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది.
పశ్చిమ బెంగాల్లో వందే భారత్ ఎక్స్ప్రెస్పై రాళ్ల దాడి జరిగింది. ఈ రైలు ప్రారంభించిన రెండు రోజులకే ఈ ఘటన మాల్దా జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. ఇండియన్ రైల్వేస్లోని కథియా డివిజన్లోని సాంసీ కుమార్గంజ్ సమీపంలో ఇది జరిగింది. దీని ప్రభావంతో డోర్లోని గాజు షీల్డ్కు పగుళ్లు ఏర్పడ్డాయి. అయితే ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై రైల్వే అంతర్గత విచారణ ప్రారంభించింది.
ఈ ఘటన దురదృష్టకరం, బాధాకరమని బీజేపీ నేత ప్రతిపక్ష నేత సువేందు అధికారి పేర్కొన్నారు. ప్రారంభోత్సవం రోజున ‘జై శ్రీరాం’ అనే నినాదాలకు ఇది ప్రతీకారమా అని ఆయన ప్రశ్నించారు. దర్యాప్తును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)కి అప్పగించాలని, నేరస్తులను శిక్షించాలని ఆయన ప్రధానమంత్రి కార్యాలయాన్ని కోరారు.
పశ్చిమ బెంగాల్ మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్
ప్రస్తుతం దాడి జరిగిన రైలు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మొదలైన మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ కావడం గమనార్హం. ఈ రైలును ప్రధాని నరేంద్ర మోడీ గత శుక్రవారం జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ప్రధాని తన తల్లి హీరాబెన్ ను కోల్పోయి, అంత్యక్రియలు నిర్వహించి మరీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తన తల్లికి సంప్రదాయబద్దంగా చేయాల్సిన అన్ని క్రతువులు పూర్తి చేసి, కొన్ని గంటల్లోనే ప్రధాని ఈ రైలును ప్రారంభించారు.
హౌరా-న్యూ జల్పైగురి మధ్య ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్తో పాటు తూర్పు భారతదేశంలో ఇది మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్. ఈ కార్యక్రమంలో గవర్నర్ సీవీ ఆనంద బోస్, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ‘‘1943లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండమాన్, నికోబార్ దీవులలో ఈ రోజున త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినందున డిసెంబర్ 30 తేదీ ముఖ్యమైనది’’ అని ప్రధాన మంత్రి తెలిపారు.
పంజాబ్ సరిహద్దులో ఉగ్రదాడులు.. పాకిస్థానీ డ్రోన్తో హెరాయిన్ను స్వాధీనం..
ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వేధిక దగ్గర బీజేపీ శ్రేణులు ‘జై శ్రీరాం’ అంటూ నినాదాలు చేశారు. దీనిని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఆమె వేధికపైకి రాబోనని స్పష్టం చేశారు. దీంతో ఇది అధికారిక కార్యక్రమం కాబట్టి ‘జై శ్రీరాం’ వంటి నినాదాలు చేయకూడదని బీజేపీ సీనియర్ నాయకులు శ్రేణులను కోరారు. మమతా బెనర్జీని వేధికపైకి రావాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎంతగా కోరినా ఆమె వినిపించుకోలేదు. వేధిక పక్క నుంచే ఆమె కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.