మన దేశానికి చెందిన వైమానిక సంస్థ స్పైస్‌జెట్ విమానం పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి దుబాయ్‌కు బయల్దేరిన ఈ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ప్రయాణికులంతా సేఫ్‌గా ఉన్నారు. 

న్యూఢిల్లీ: మన దేశానికి చెందిన స్పైస్ జెట్ విమానయాన సంస్థకు చెందిన ఓ విమానం పాకిస్తాన్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. కరాచీలో మంగళవారం స్పైస్ జెట్ ఎస్‌జీ-11 ఫ్లైట్ ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి ఈ విమానం దుబాయ్‌కు బయల్దేరింది. కానీ, మార్గమధ్యలోనే ఫ్లైట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆ విమానం పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. అయితే, విమానంలోని ప్రయాణికులు అందరూ సేఫ్‌గా ఉన్నారని న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించింది.

తమ ఫ్లైట్ కరాచీలో సేఫ్‌గా ల్యాండ్ అయిందని, ప్రయాణికులను సురక్షితంగా కిందికి దింపామని స్పైస్ జెట్ ఎయిర్‌లైన్ ప్రతినిధి తెలిపారు. జులై 5వ తేదీన స్పైస్‌జెట్ బీ737 ఎయిర్‌క్రాఫ్ట్‌ ఆపరేేటింగ్ ఫ్లైట్ ఎస్‌జీ -11 ఢిల్లీ నుంచి దుబాాయ్‌కు బయల్దేరిందని వివరించారు. అయితే, ఇండికేట్ లైట్ సరిగా పని చేయకపోవడంతో ఫ్లైట్‌ను కరాచీకి డైవర్ట్ చేశామని తెలిపారు. తమ విమానం కరాచీలో సురక్షితంగా ల్యాండ్ అయిందని చెప్పారు. ప్రయాణికులందరినీ విమానం నుంచి సురక్షితంగా కిందకు దింపామని వివరించారు. 

ఎలాంటి ఎమర్జెన్సీని ప్రకటించలేదని, విమానం నార్మల్ ల్యాండింగ్ అయిందని ఆయన వెల్లడించారు. అయితే, ఆ విమానంలో ఇది వరకు ఇలాంటి సాంకేతిక సమస్యకు సంబంధించి సూచనలు లేవని తెలిపారు. ప్రయాణికులందరికీ స్నాక్స్ అందించామని వివరించారు. కరాాచీకి మరో విమానాన్ని తాము పంపుతున్నామని, ఆ విమానంలో కరాచీలో దిగిన ప్రయాణికులందరినీ దుబాయ్‌కు తీసుకెళ్తామని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. గత వారం స్పైస్‌ జెట్ విమానంలో పొగలు చెలరేగడం తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీ నుంచి జబల్‌పూర్ బయలుదేరిన స్పైస్ జెట్ విమానంలో ప్రయాణికుల క్యాబిన్‌లో పొగలు వస్తున్నట్లు సిబ్బంది గమనించారు. విమానం 5,000 అడుగుల ఎత్తులో ఉన్న సమయంలో క్యాబిన్‌లో పొగలు వచ్చాయి. దీంతో జబల్‌పూర్‌కు బయలుదేరిన స్పైస్‌జెట్ విమానం తిరిగి ఢిల్లీకి చేరుకుందని ఏఎన్‌ఐ వార్తా సంస్థ పేర్కొంది. క్యాబిన్‌లో పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ఇందుకు సంబంధించి ఏన్‌ఐ వార్తా సంస్థ ట్వీట్ చేసిన వీడియోలో.. ఫ్లైట్‌లోని ప్రయాణికుల క్యాబిన్ పొగతో నిండి ఉన్నట్టుగా కనిపించింది. అయితే ప్రయాణికులు అంతా క్షేమంగా ఉన్నట్టుగా సమాచారం. 

‘‘ఢిల్లీ నుంచి జబల్‌పూర్‌కు వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం ఈ రోజు ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి సురక్షితంగా తిరిగి వచ్చింది. సిబ్బంది 5000 అడుగులు దాటిన సమయంలో క్యాబిన్‌లో పొగను గమనించారు. ప్రయాణికులు సురక్షితంగా దిగారు’’ అని స్పైస్‌జెట్ ప్రతినిధి ఒకరు తెలిపినట్టుగా వార్తా సంస్థ పేర్కొంది. ఇక, ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు.