ప్రధాని నరేంద్ర మోడీపై పలువురు నెటిజన్లు అభిమానం చాటుకున్నారు. ఈ మేరకు ఆయన వ్యక్తిగత జీవితం, వివరాలతో modistory.in అనే వెబ్సైట్ను రూపొందించారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్విట్టర్ (twitter) , ఇన్స్టాగ్రామ్లో (instagram) ఆయనను ఫాలో చేసే వారి సంఖ్య మిలియన్లలో వుంటుంది. ఆయన పుట్టినరోజును ఏ రేంజ్లో సెలబ్రేట్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేఫథ్యంలో నరేంద్ర మోడీ జీవిత విశేషాలతో కొందరు నెటిజన్లు ఓ ప్రత్యేకమైన వెబ్సైట్నే తీసుకొచ్చారు. ఆయన్ను దగ్గర్నుంచి చూసిన సన్నిహితులు చెప్పిన వివరాల ఆధారంగా modistory.in అనే సైట్ను స్టార్ట్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ తన జీవితంలో అత్యంత ఆరాధించిన వ్యక్తులు, ఆయన రాసిన ఉత్తరాలు, వ్యక్తిగత జ్ఞాపికలకు సంబంధించిన వివరాలను అందులో పొందుపరిచారు. దానికి సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రులు స్మృతీ ఇరానీ (smriti irani), అనురాగ్ ఠాకూర్ (anurag thakur)లు వెల్లడించారు. 'ఎవరికీ తెలియని, ఎవరూ వినని, చూడని ప్రధాని నరేంద్ర మోదీ జీవిత విశేషాలు మీకోసం ఇవిగో..' అంటూ స్మృతీ ఇరానీ ట్వీట్ చేశారు. ఆ వెబ్సైట్ లింకునూ షేర్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలతో పలువురు ఔత్సాహికులు వెబ్సైట్ను తయారు చేశారని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
1980ల్లో ఒకానొక సందర్భంలో తాను ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ప్రయాణం చేశానని, ఆ సమయంలో ఎన్నో ఆసక్తికర విషయాలు, గుండెల్ని పిండేసే వివరాలనూ ప్రధాని తనతో పంచుకున్నారని గుజరాత్కు చెందిన డాక్టర్ అనిల్ రావల్ అనే వ్యక్తి చెప్పారు. ఓ సారి తాను మురికివాడల్లో మట్టిగోడలు, రేకులు వేసుకుని ఉంటున్న ఓ స్వయం సేవక్ ఇంటికి వెళ్లినప్పుడు జరిగిన ఘటనను ప్రధాని చెప్పారని ఆయన వెల్లడించారు.
‘‘ఆ ఇంటివాళ్లు భోజనం వడ్డించి.. రొట్టె, కూరతో పాటు పాలిచ్చారని మోడీ చెప్పారు. అయితే, తల్లి ఒడిలో కూర్చున్న ఆ చిన్నారి పాల వైపే చూస్తున్నాడని ... నేను తినేసి, ఆ పాలను వదిలేసి పైకి లేచి వచ్చేశానని పేర్కొన్నారు. ఆ తర్వాత పాలను తల్లి బిడ్డకు పట్టేసింది. ఆ ఘటనను చూశాక నా మనసు చలించింది’’అంటూ ప్రధాని మోదీ చెప్పిన విషయాన్ని డాక్టర్ రావల్ గుర్తు చేశారు. అలాంటి ఎన్నో విశేషాలతో ఈ వెబ్సైట్ ను రూపొందించినట్టు రావల్ పేర్కొన్నారు.
