పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. పాత భవనంలోనే ప్రారంభం.. రెండో రోజు నుంచి కొత్త భవనంలోకి..!!
కేంద్రంలోని మోదీ సర్కార్ ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశాలను పార్లమెంట్ నూతన భవనంలో నిర్వహించాలని నిర్ణయించినట్టుగా సమాచారం.

కేంద్రంలోని మోదీ సర్కార్ ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశాలను పార్లమెంట్ నూతన భవనంలో నిర్వహించాలని నిర్ణయించినట్టుగా సమాచారం. అయితే సెప్టెంబరు 18న ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పాత భవనంలో ప్రారంభం కానున్నట్టుగా తెలుస్తోంది. అయితే సెప్టెంబర్ 19న గణేష్ చతుర్థి సందర్భంగా పార్లమెంటరీ కార్యకలాపాలు కొత్త భవనంలోకి తరలించనున్నారు. దీంతో పార్లమెంట్ నూతన భవనంలో జరగనున్న తొలి సమావేశాలు ఇవే కానున్నాయి. ఇక, కొన్ని రోజుల క్రితం పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ముగియగా.. వాటిని ప్రస్తుతం ఉన్న పాత భవనంలోనే నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నెల 18 నుంచి 22వ తేదీ మధ్య ఐదు రోజుల పాటు జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఇండియా పేరు మార్పుకు సంబంధించిన బిల్లును కేంద్ర ప్రవేశపెట్టనున్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇదిలాఉంటే, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు సంబంధించి ఏజెండాను కేంద్రం వెల్లడించకపోవడంతో కాంగ్రెస్తో సహా పలు ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సెప్టెంబర్ 18-22 తేదీల్లో జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండాను కోరుతూ కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తన లేఖలో తొమ్మిది అంశాలను కూడా జాబితా చేశారు. పార్లమెంట్ ప్రత్యేక సెషన్లో వాటిపై చర్చకు సమయం ఇవ్వాలని ప్రధాని మోదీని కోరారు.
‘‘మీరు సెప్టెంబర్ 18, 2023 నుండి పార్లమెంటు ఐదు రోజుల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇతర రాజకీయ పార్టీలతో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారనే విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఆ సమావేశాల అజెండా గురించి మాకెవ్వరికీ తెలియదు’’ అని సోనియా గాంధీ పేర్కొన్నారు.