ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో దక్షిణ భారత దేశపు అతిపెద్ద హనుమాన్ విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ఈ ఏకశిలా హనుమాన్ విగ్రహ పనులు నాలుగు నెలల క్రితమే ప్రారంభమయ్యాయి. ఈ విగ్రహాన్ని త్రిస్సూర్‌లోని ఆలయంలో ప్రతిష్టాపిస్తారు. 

హైదరాబాద్: దక్షిణ భారత దేశంలో అతిపెద్ద ఏకశిల హనుమాన్ విగ్రహం ఆంధ్రప్రదేశ్‌లో నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డలో తయారవుతున్నది. నాలుగు నెలల క్రితం ఈ భారీ హనుమాన్ విగ్రహం తయారీ ప్రారంభమైంది. ఈ విగ్రహాన్ని కేరళలోని త్రిస్సూర్‌లో పూంకున్నమ్ పుష్పగిరి అగ్రహార సీతారామస్వామి ఆలయం ఎదుట ప్రతిష్టించనున్నారు. ఈ విగ్రహం 55 అడుగుల ఎత్తు ఉంటుంది. విగ్రహం 35 అడుగుల ఎత్తు ఉండగా.. 20 అడుగులు దాని కింద ఏర్పాటు చేసే బేస్ ఉండనుంది.

ఈ విగ్రహాన్ని ఏప్రిల్ మొదటి వారంలో పూంకున్నమ్‌కు తీసుకెళ్లనున్నారు. పూంకున్నమ్ ఆలయంలో దేశంలోనే అతిపెద్ద బంగారు రథం ఉన్నది. హనుమాన్ విగ్రహం చెక్కడానికి రాయి కోసం ఎంతో వెతికారు. చివరకు ఆ ఏకశిలను గుర్తించారు. హనుమాన్ విగ్రహం నిలబడిన స్థితిలో చెక్కుతున్నారు. ఒక చేతితో భక్తులను దీవిస్తున్నట్టు ఉండగా.. మరో చేతితో గదను పట్టుకుని నిలబడి ఉంటాడు.

Also Read: ఢిల్లీ లిక్కర్ స్కామ్.. అభిషేక్ బోయిన్‌పల్లి బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ.. ఈడీకి నోటీసులు

ఈ విగ్రహాన్ని ప్రముఖ శిల్పి వీ సుబ్రమణియమ్ ఆచార్యులుకు చెందిన శ్రీ భారతి స్కల్ప్చర్ సెంటర్ చెక్కుతున్నది. నలభైకి మించిన శిల్పులు ఈ విగ్రహ తయారీలో పాలుపంచుకుంటున్నారు.

ఈ విగ్రహం పూర్తిగా సిద్ధమైన తర్వాత బెంగళూరు మీదుగా దీన్ని త్రిస్సూర్‌కు తీసుకెళ్లుతారు. రెండు ట్రైలర్స్‌ను అటాచ్ చేసిన ట్రక్ పై ఈ విగ్రహాన్ని తీసుకెళ్లనున్నారు. ఆ తర్వాత ఓ ప్రత్యేక బృందం కేరళకు వెళ్లుతుంది. వారే ఒక క్రేన్ సహాయంతో ఆలయంలో ప్రతిష్టాపిస్తారు.