రాజకీయాలకు సోనియా దూరం..ఆమె స్థానంలో ప్రియాంక?
2019 ఎన్నికల్లో సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బరేలి నుంచి లోక్ సభ స్థానానికి ప్రియాంకా గాంధీ పోటీ చేయనున్నారని సమాచారం.
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయాలకు దూరం కానున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో.. సోనియా గాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ.. ఆమె స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.
సోనియా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నందున రాయ్ బరేలీ స్థానంలో కుమార్తె ప్రియాంకాగాంధీ పోటీ చేసే అవకాశాలున్నాయంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. 2019 ఎన్నికల్లో సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బరేలి నుంచి లోక్ సభ స్థానానికి ప్రియాంకా గాంధీ పోటీ చేయనున్నారని సమాచారం.
ప్రియాంకా గాంధీ కూడా రాజకీయ ప్రవేశంపై ఎంతో ఆసక్తితో ఉన్నట్లు మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీకి మార్గదర్శకుడిగా వ్యవహరించిన గయప్రసాద్ మరణానికి ముందే తెలిపినట్లు ఆయన కుమారుడు జగదీష్ శుక్లా రాయ్ తెలిపారు. రాజకీయాల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చక్రం తిప్పే సమయం ఆసన్నమైందని జగదీష్ చెప్పుకొచ్చారు.
రాహుల్తో పోలిస్తే.. ప్రియాంకా గాంధీ తన ఆలోచనలను నిక్కచ్చిగా చెప్పగలరని.. రాహుల్ మితభాషి కావడంతో వీరిద్దరి కలయికతో కాంగ్రెస్ పార్టీకి కొత్త కళ రావడం ఖాయమని జగదీష్ శుక్లా వివరించారు. 2019లో రాయ్ బరేలీ నుంచి ప్రియాంకా గాంధీ పోటీచేస్తారా అని కార్యకర్తలందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారని ఆయన తెలిపారు.
అయితే.. సోనియా పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారని చెప్పలేమని.. ఆమె ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టగలరని మరో కాంగ్రెస్ నేత పేర్కొన్నారు.