రాహుల్ ఆ పనులేంటీ..? లోక్సభలో కొడుకు చర్యలపై సోనియా సీరియస్
శుక్రవారం అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రవర్తించిన తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
శుక్రవారం అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రవర్తించిన తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై మాట్లాడిన రాహుల్ గాంధీ ప్రభుత్వంపై ఓ రేంజ్లో ఫైరయ్యారు. విభజన హామీలతో పాటు మరికొన్ని అంశాలపై ఆయన ప్రధానిని నిలదీయడంతో సభ మొత్తం అటెన్షన్లో ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో తన ప్రసంగాన్ని పూర్తి చేసిన రాహుల్ నేరుగా ప్రధాని మోడీ సీటు వద్దకు వెళ్లి ఆయన్ను కౌగిలించుకున్నారు.. ఈ పరిణామంతో సభ్యులు ఆశ్చర్యపోయారు. మోడీని ఆలింగనం చేసుకుని తిరిగి వెళ్లిపోతున్న అనంతరం రాహుల్ను వెనక్కి పిలిచిన మోడీ.. కరచాలనం చేసి యువనేత భుజం తట్టారు. అనంతరం తన స్థానంలో కూర్చొన్న రాహుల్ను తోటి సభ్యులు ఏదో అడగటంతో దానికి సమాధానంగా ఆయన కన్నుకొట్టారు.
మరోవైపు ఆయన చర్యపై లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. రాహుల్ గాంధీ అలా చేసి ఉండాల్సింది కాదని.. సభా మర్యాదను సభ్యులే కాపాడాలని.. రాహుల్ గాంధీ కౌగిలించుకున్నారు.. కన్నుకొట్టారు.. అది సరైన పని కాదు.. ఆయన చేసిన పని నాకు నచ్చలేదని మందలించారు. దీంతో ఆ రెండు దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
‘పప్పుకీఝప్పీ (పప్పు కౌగిలింత)’, ‘హగ్ప్లొమసీ’ అనే హ్యాష్ట్యాగ్లతో నెటిజన్లు హోరెత్తించారు. ప్రియా వారియర్ కంటే రాహులే బాగా కన్నుకొట్టారని సెటైర్లు వేశారు. పార్టీ పరువు పొతుండటంతో యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ సీరియస్ అయ్యారు.. ఓటింగ్ ముగిశాక బయటకు వచ్చిన తర్వాత రాహుల్ను తన ఛాంబర్కు పిలిపించుకుని గట్టిగా మాట్లాడినట్లు ఓ జాతీయ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది.