భార్య వ్యాపారం కోసం అప్పు తీసుకున్న ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కోవిడ్ మహమ్మారి కారణంగా దానిని తీర్చలేకపోయాడు. దీంతో మనస్థాపం చెందిన అతడు ఘోరానికి తెగించాడు. భార్య, పిల్లలను హత్య చేసి అనంతరం అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది.
తమిళనాడు రాజధాని చెన్నైలో ఘోరం జరిగింది. ఓ టెక్కి దారుణానికి ఒడిగట్టాడు. భార్య, పిల్లలను ఎలక్ట్రిక్ రంపంతో కోసి, అనంతరం అతడూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చెన్నైలోని పల్లవరం ప్రాంతంలో శుక్రవారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే పెళ్లి రోజు సందర్భంగా ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఈ ఘోరానికి పాల్పడటం విచారకరం.
మృతి చెందిన ఇంజనీర్ను 41 ఏళ్ల ప్రకాష్గా పోలీసులు గుర్తించారు. అయితే తమ మరణాలకు ఎవరూ బాధ్యులు కాదని మృతుడు సూసైడ్ నోట్ వదిలిపెట్టాడని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం తెలిపింది. టెక్కీ భార్య గాయత్రి (39), నిత్యశ్రీ (13), పి హరికృష్ణన్ (8)గా గుర్తించారు. చనిపోయిన ఇద్దరు పిల్లల్లో ఒకరు తొమ్మిదో తరగతి చదువుతుండగా.. మరొకరు రెండో తరగతి చదువుతున్నారు.
ఎలా భయటపడిందంటే ?
ప్రకాశ్ మామ రమణన్ శనివారం ఉదయం తన కుమార్తె గాయత్రికి ప్రసాదం ఇవ్వడానికి ఇంటికి వచ్చిన తరువాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలను రమణన్ చూశాడు. దీంతో ఒక్క సారిగా షాక్ కు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించాడు. అయితే బాధితులందరి మెడలో కోత గుర్తులు ఉన్నాయి.
అప్పులే కారణమా.. ?
ఈ దారుణానికి కారణం ఏంటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం పోలీసులు వివరాలు వెళ్లడించారు. దాని ప్రకారం.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రకాశ్ కాగ్నిజెంట్ టెక్నాలజీస్ లో ఉద్యోగం చేస్తున్నారు. భార్య గాయత్రి కూడా స్థానికంగా మూలికా మందుల దుకాణం నడుపుతోంది.
కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రకాష్ తన భార్య వ్యాపారం కోసం అప్పులు తీసుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఆ అప్పును సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చెల్లించలేకపోయాడు. అప్పు మొత్తం రూ.10 లక్షల వరకు పెరిగిందని, దీంతో ఏం చేయాలో తెలియక ఇలాంటి ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు ముందు వారు తిన్న ఆహారంలో మత్తు మందులు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి పోలీసులు మిగిలిపోయిన ఆహారపు శాంపుల్స్ సేకరించారు.
ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో రెండేళ్ల కిందట చోటు చేసుకుంది. భార్యా పిల్లలకు విషమిచ్చి, వారు చనిపోయిన తరువాత ఓ టెక్కీ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా దేవరకొండ మండలం నేరడిగొమ్మకు చెందిన ప్రదీప్ తన భార్య స్వాతి ఇద్దరు పిల్లలతో కలిసి హైద్రాబాద్ హస్తినాపురంలో నివాసం ఉండేవారు.
రాష్ట్రాల అభివృద్ధి లేకుండా దేశం ఎప్పటికీ పురోగమించదు - ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేసే ప్రదీప్ రూ. 40 లక్షలను అప్పుగా తీసుకొచ్చి వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టారు. వాటిల్లో నష్టం రావడంతో అప్పు మిగిలింది. అయితే దీనికి మనస్థాపం చెందిన ప్రదీప్ ముందుగా భార్య స్వాతితో పాటు ఇద్దరు పిల్లలు జయకృష్ణ, కళ్యాణ్ తినే భోజనంలో పురుగుల మందు కలిపి ఇచ్చాడు. ఈ భోజనం తిన్న తర్వాత ఈ ముగ్గురు మృతి చెందారు. అనంతరం అతడూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. ఆత్మహత్యతో ఎవరూ ఏమీ సాధించలేరు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వస్తే వెంటనే 9152987821 అనే ప్రభుత్వ హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేయండి. వారు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు సహాయం చేస్తారు.
