మధ్యాహ్న భోజనంలో పాము... 100 మందికి పైగా విద్యార్థుల అస్వస్థత
మధ్యాహ్న భోజనంలో పాము పడి 100 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయిన ఘటన బిహార్ లో వెలుగుచూసింది.
బిహార్ : ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం వండిన వంటలో పాము పడింది. ఈ విషయాన్ని వంటవాళ్లు, పాఠశాల సిబ్బంది ఎవ్వరూ గమనించలేదు. దీంతో విషపూరితమైన ఆహారం తిని 100మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
బిహార్ రాష్ట్రంలోని అరారియా జిల్లా ఫర్బిస్గంజ్ సమీపంలోని జోగ్బాని స్కూల్లో మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు పెట్టిన అహారంలో పాము కనిపించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే పాము పడిన వంటలు తిని తమ పిల్లలు హాస్పిటల్ పాలయ్యారని ఆరోపించారు. పాఠశాల వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.
పాము పడిన ఆహారం తిన్న చాలామంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. దీంతో పాఠశాల సిబ్బంది వెంటనే వారిని స్థానిక హాస్పిటల్ కు తరలించారు. విషయం తెలిసి మిగతా విద్యార్థులను కూడా వైద్య పరీక్షల కోసం తల్లిదండ్రులు వివిధ హాస్పిటల్స్ కు తరలించారు. అయితే ప్రస్తుతం చిన్నారుల ఆరోగ్యం మెరుగ్గానే వున్నట్లు... ఎవ్వరికీ ప్రాణహాని లేదని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
Read More స్కూల్ లో టెన్త్ విద్యార్థినీపై గ్యాంగ్ రేప్, ఆపై మర్డర్.. ప్రిన్సిపాల్ తో సహా ముగ్గురిపై కేసు..
అయితే విద్యార్థులు తిన్న ఆహారాన్ని పాఠశాలలో వండలేదని... బయటినుండి ఓ కాంట్రాక్టర్ సరఫరా చేసాడని స్కూల్ సిబ్బంది చెబుతున్నారు. కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడినవారిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.