Asianet News TeluguAsianet News Telugu

డబ్బులు రాలేవని ట్రైన్ బోగీలోనే పాములు వదిలిన పాములాడించేవారు.. బోగీలో గందరగోళం

ఉత్తరప్రదేశ్‌లో కొందరు పాములు ఆడించేవారు ట్రైన్ ఎక్కారు. ట్రైన్ కదలగానే బుట్టలను తెరిచి పాములను ఆడించడం మొదలు పెట్టారు. ఆ తర్వాత ప్రయాణికుల నుంచి డబ్బులు అడిగారు. వారు అనుకున్నన్ని డబ్బులు రాకపోవడంతో పాములను బోగీలోకి వదిలారు. దీంతో 30 నిమిషాలపాటు ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.
 

snake charmers released snakes in train after not earning enough money in uttar pradesh kms
Author
First Published Sep 10, 2023, 5:04 PM IST

న్యూఢిల్లీ: సాధారణ ప్రయాణికులు ఎక్కినట్టే నలుగురు పాములాడించేవారు కూడా పాము బుట్టలు చేతపట్టుకుని ట్రైన్ బోగీలోకి ఎక్కారు. ట్రైన్ కదిలిన తర్వాత బుట్ట పై కప్పు తీసేశారు. అందులోని పాములు తలలు బయటకు పెట్టాయి. వారు పాములు ఆడించడం మొదలు పెట్టారు. కొద్దిసేపు ఈ ఆట సాగిన తర్వాత వారు ప్రయాణికుల నుంచి డబ్బుల కోసం అడిగారు. కొందరు ఇచ్చారు. మరికొందరు నిరాకరించారు. వారు అనుకున్నంత డబ్బులు రాలేవని పాములు ఆడించేవారు ఆగ్రహానికి లోనయ్యారు. కొందరు ప్రయాణికులతో గొడవ పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆగ్రహంతోనే పాములను విడిచిపెట్టారు. ఆ పాములు బుట్టలో నుంచి బయటికి వచ్చి బోగీలో పాకడం మొదలు పెట్టాయి. దీంతో ప్రయాణికులు గుండె చేతిలోకి వచ్చినంత పనైంది. అందరూ మూలలకు పరుగులు పెట్టారు. పైన బెర్త్‌ల కోసం ఎగబడ్డారు. కొందరు టాయిలెట్ రూమ్‌లలోకి పరుగు తీశారు.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని చంబల్ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. హౌరా, గ్వాలియర్‌ల నడుమ ప్రయాణించే ట్రైన్‌లో ఈ ఘటన జరిగింది. బందా స్టేషన్‌లో ఈ పాములాటలవాళ్లు ట్రైన్ ఎక్కారు. 60 నిమిషాల తర్వాత వచ్చిన మహోబా రైల్వే స్టేషన్‌లో దిగిపోయారు. అయితే.. వారు ట్రైన్ ఎక్కినాక బోగీలో పాములను వదిలిపెట్టిన 30 నిమిషాలపాటు గందరగోళం నెలకొంది. ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ నిమిషాలు లెక్కపెట్టుకున్నారు. ఆ సమయం పీడకలలా సాగింది. కొందరైతే రైల్వే కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి విజ్ఞప్తులు చేశారు. ఆ ట్రైన్ మహోబాకు రాగానే ఆ ప్రయాణికులు పోలీసుల వద్దకు వెళ్లారు. వారు బోగీలోకి ఎక్కారు. కానీ, అప్పటికే ఆ పాములాడించే వారు జారుకున్నారు.

Also Read: మరోసారి వర్చువల్‌గా భేటీ అవుదాం.. బ్రెజిల్ బాధ్యతలు తీసుకోవడానికి ముందే.. ప్రధాని మోడీ ప్రతిపాదన

ఆ తర్వాత కూడా పోలీసు సిబ్బంది జాగ్రత్తగా ట్రైన్ బోగీ మొత్తం వెతికారు. కానీ, పాముల ఆనవాళ్లేవీ కనిపించలేవు. వారే ఆ పాములను కూడా వెంటబెట్టుకుని దిగిపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాత ట్రైన్ గ్వాలియర్‌కు తన ప్రయాణాన్ని కొనసాగించింది. ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేసిన ఆ పాములు ఆడించేవారిని పట్టుకుంటామని రైల్వే పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios