జమ్మూ కాశ్మీర్ లోని వివిధ ప్రాంతాల నుంచి 6 గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వారి వద్ద నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇండియన్ ఆర్మీ, సీఆర్ పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో ఈ అరెస్టులు జరిగాయి.
కశ్మీర్ లో భద్రతా దళాలు నిర్వహించిన మూడు ఆపరేషన్లలో ఇద్దరు క్రియాశీల ఉగ్రవాదులు, ముగ్గురు హైబ్రిడ్ ఉగ్రవాదులతో మొత్తంగా ఆరుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశాయి. లష్కరే తోయిబాతో సంబంధాలున్న ఈ ఇద్దరు ఉగ్రవాదులను బారాముల్లా జిల్లాలో అరెస్టు చేసినట్లు పోలీసు అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
అరెస్టయిన ఉగ్రవాదుల్లో ఇర్షాద్ అహ్మద్ మీర్, జాహిద్ బషీర్ పటాన్ ప్రాంతంలోని నేహాల్పోరా నివాసితులు. వారి వద్ద నుంచి రెండు చైనీస్ పిస్టోళ్లు, 18 లైవ్ రౌండ్లు, రెండు మ్యాగజైన్లను స్వాధీనం చేసుకున్నారు. లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న మరో ఇద్దరు హైబ్రిడ్ ఉగ్రవాదులను బారాముల్లా జిల్లాలోని సోపోర్ ప్రాంతంలోని గుర్సీర్ వద్ద పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సైన్యం సంయుక్తంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద గురువారం రాత్రి అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.
షోపియాన్ నివాసి ఫైజాన్ అహ్మద్ పాల్, పుల్వామా నివాసి ముజామిల్ రషీద్ మీర్ లు సాధారణ పౌరులు, ర్మికులు అలాగే భద్రతా దళాలపై దాడులు జరిపేందుకు సరైన అవకాశం కోసం వెతుకుతున్నారని అధికార ప్రతినిధి తెలిపారు. వారి వద్ద నుంచి రెండు పిస్టోళ్లు, రెండు మ్యాగజైన్లు, ఐదు పిస్టల్ రౌండ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే బుద్గాం జిల్లాలో ముదబీర్ ఐజాజ్, అతని సహచరుడు సయ్యద్ ముంతాహా అనే హైబ్రిడ్ ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
జమ్మూకాశ్మీర్ లో మళ్లీ ఉగ్ర కార్యకలాపాలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో ప్రజల్లో మళ్లీ భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు ఉగ్రవాదులను గుర్తించి అరెస్టులు చేస్తున్నాయి. ఇటీవల అమయకులైన పౌరులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. కొన్ని రోజుల కిందట పంజాబ్కు చెందిన ఒక వలస కార్మికులపై కూడా ఉగ్రవాది కాల్పులు జరిపాడు. అలాగే బుద్గాం జిల్లా మగ్రేపోరా చదూరా ప్రాంతంలో అర్నియా బీహార్కు చెందిన దిల్ఖుష్ కుమార్, పంజాబ్కు చెందిన రాజన్ అనే ఇద్దరు వలస కార్మికులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వారు ఇటుక బట్టీలో పనిచేస్తున్నారు. వారి శరీరాలనూ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల వల్ల గాయాలు ఏర్పడ్డాయి. వెంటనే వారిని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే దిల్ ఖుష్ కుమార్ హాస్పిటల్ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించాడు.
Prophet Row : ప్రయాగ్ రాజ్, ఇతర నగరాల్లో హింసాత్మక నిరసనలకు పాల్పడిన 109 మంది అరెస్ట్
వలస కార్మికులు, కాశ్మీర్ పండిట్లలో భయాందోళనలు కలిగించే ప్రయత్నంలో భాగంగా ఉగ్రవాదులు ఇటీవలి కాలంలో లోయలో దాడులను పెంచుతున్నారు. అందులో భాగంగానే ఈ వారం ప్రారంభంలో ఓ ఉగ్రవాది సాంబాకు చెందిన రజినీ బాలా అనే మహిళా హిందూ ఉపాధ్యాయిని కాల్చి చంపాడు. ఆమె కుల్గాంలో పని చేస్తున్నారు. ఆమె కంటే ముందే కశ్మీర్ పండిట్ రాహుల్ భట్ ను ఆయన కార్యాలయంలోనే కాల్చి చంపారు. తహసీల్ కార్యాలయంలో క్లర్క్గా పని చేస్తున్న ఆయన హత్యకు గురవడంతో లోయ ప్రాంతంలో పండిట్లు ఆందోళన చేపట్టారు. జమ్మూ కాశ్మీర్ లోని బుద్గామ్ జిల్లాలో రాజస్థాన్కు చెందిన బ్యాంక్ మేనేజర్ని, బీహార్కి చెందిన వలస కార్మికుడిని ఉగ్రవాదులు కాల్పుఉ జరిపి హతమార్చారు.
