ప్రణాళిక ప్రకారమే రైతులపైకి కారెక్కించారు.. లఖింపూర్ ఘటనలో సిట్
లఖింపూర్ ఘటనలో సిట్ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటన అనుకోకుండా జరిగింది కాదని, ఉద్దేశపూర్వకంగానే చేశారని తెలిపింది.
పక్కా ప్రణాళిక ప్రకారమే, ఉద్దేశపూర్వకంగానే రైతులపైకి కారెక్కించారని, ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదని లఖింపూర్ ఘటనపై దర్యాప్తు చేస్తున్న సిట్ వ్యాఖ్యానించింది. వారిపై హత్యాభియోగం నమోదు చేసేందుకు అనుమతి కావాలని కోరింది. దీనికి కోర్టు అనుమతి ఇచ్చింది. కేంద్ర తీసుకొచ్చిన మూడు నూతన సాగు చట్టాలు రద్దు చేయాలని కోరుతూ రైతులు చేస్తున్న ఉద్యమంలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ లో రైతులు నిరసన చేపట్టారు. రైతులు నిరసన తెలుపుతున్న సమయంలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అశిష్ మిశ్రా నడుపుతున్న కారు నిరసనకారుల మీదు నుంచి వెళ్లింది. ఈ ఘటనలో అక్కడిక్కడే నలుగురు రైతులు మృతి చెందారు. అనంతరం చోటు చేసుకున్న అల్లర్లలో మరో 4 గురు మృతి చెందారు. దీనిని కవర్ చేసేందుకు వెళ్లిన ఒక రిపోర్టర్ కూడా ఈ ఘటనలో మృతి చెందారు. ఈ ఘటనతో దేశం మొత్తం ఒక్కసారిగా కలకలం రేగింది. రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాయి. కావాలనే రైతులపై కారు ఎక్కించారని నిరసనలు చేపట్టారు. దేశం మొత్తం ఈ ఘటనపై నిరసనలు వెల్లువెత్తడంతో సుప్రీం కోర్టు ఈ అంశంలో కలుగజేసుకుంది. దీంతో యూపీ ప్రభుత్వం ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి సిట్ ఏర్పాటు చేసింది. అంతకు ముందే స్థానిక పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిర్లక్షంగా కారు నడపటం వల్ల జరిగిన ప్రమాదమని అక్కడి పోలీసులు ఒక సెక్షన్ కింద దర్యాప్తులో పొందుపర్చారు. ఇప్పుడు దానిపై సిట్ అభ్యంతరం తెలిపింది. ఇది నిర్లక్ష్యంగా కారు నడపడం వల్ల జరిగిన ప్రమాదం కాదని, కక్షపూరితంగానే రైతుల మీదు నుంచి కారు నడిపారని సిట్ పేర్కొంది. ఆ సెక్షన్ స్థానంలో 307 సెక్షన్ నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలని మంగళవారం నాడు సిట్ కోర్టును కోరడంతో కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ ఘటనలో ఇప్పటికే 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారంతా ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు.
కరోనాతో ఆస్పత్రిలో చేరిన ఆరుగురు.. ఆ సంకేతాలతో ఒమిక్రాన్ టెన్షన్..
సిట్ తన దర్యాప్తులో భాగంగా ఈ ఘటన ఉద్దేశపూర్వకంగానే జరిగిందని తెలపడంతో కాంగ్రెస్, ఇతర విపక్షాలు నిరసనలు తెలిపాయి. బీజేపీపై తీవ్ర విమర్శలు చేశాయి. ఇలాంటి ఘటనకు కారణమైన అశిష్ మిశ్రా తండ్రిని ఇంకా మంత్రిగా ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించింది. వెంటనే ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మోడీవి రైతు వ్యతిరేక విధానాలు కాబట్టే.. అజయ్ మిశ్రాపై చర్యలు తీసుకోవడం లేరని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు. కేంద్ర మంత్రిని కూడా అరెస్టు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి.
మమతకు షాకిచ్చిన సోనియా.. విపక్ష నేతల సమావేశానికి తృణమూల్కు దక్కని ఆహ్వానం
కేంద్ర ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన సాగు చట్టాలు రైతులకు మేలు చేయకపోగా.. నష్టం చేకూరుస్తాయని రైతులు ఆరోపించారు. వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. సుధీర్ఘ కాలంపాటు సాగిన ఈ పోరాటంలో చివరికి రైతులు విజయం సాధించారు. కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రధాని ప్రకటించారు. అనంతరం శీతాకాల సమావేశంలో ఆ సాగు చట్టాల రద్దు బిల్లును వెనక్కి తీసుకున్నారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.