మీ సిక్ మైండ్ ను మీ దగ్గరే పెట్టుకోండి... ట్రోలర్స్ కు శశిథరూర్ రిటార్ట్.. అసలు విషయం ఏంటంటే...
తనతో దిగిన ఫొటో షేర్ చేసినందుకు ఓ మహిళను ఇబ్బందులకు గురిచేసిన వారిది సిక్ మైండ్ అంటూ కాంగ్రెస్ నేత శశిథరూర్ ట్వీట్ చేశారు.
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత శశిథరూర్ తో ఫొటో దిగిన ఓ యువతిని సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా ట్రోల్స్ చేయడం మీద ఆయన స్పందించారు. ‘ఈ ట్రోల్స్ వల్ల అమాయకులు తీవ్రంగా నష్టపోతున్నారనేది గ్రహించాలి. ఆ అమ్మాయితో ఆ ఫొటో వందమందికి పైగా ఉన్న ఓ కార్యక్రమంలో దిగాను. ఆ రోజు ఓ యాబై మందితో నేనిలా ఫొటోలు దిగాను. మీ సిక్ మైండ్ ను మీ దగ్గరే పెట్టుకోండి... ట్రోల్స్’ అంటూ ట్వీట్ చేశారు.
దీంతోపాటు తనతో ఫొటో దిగడం వల్ల అబ్యూస్ కు, ట్రోల్స్ కు గురవుతుందో ఆ మహిళ పెట్టిన పోస్టును షేర్ చేశారు. ఆ మహిళ తన పోస్ట్లో ఆ ఫొటోకు సంబంధించి వివరణ ఇస్తూ.. శశిథరూర్ కాంగ్రెస్ నాయకుడే కాదు, ప్రముఖ రచయిత కూడా. ఆయనను ఒక లిటరరీ ఫెస్ట్లో కలిశాను. చాలా మందిలాగే నేను కూడా ఆయనతో ఫొటోలు దిగాను అని చెప్పుకొచ్చింది.
"ఈ ఫొటో వెనుక ఎలాంటి రాజకీయ లేదా వ్యక్తిగత విషయాలు లేవు. నేను ఎప్పుడూ ఆయనను ఉన్నతంగానే చూస్తాను" అని ఆమె చెప్పింది. "కానీ దాని మీద నీచమైన కథనాలు ప్రచారం చేయడం మొదలుపెట్టారు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నా ఫొటోలను వారి స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం ఆవేదన కలిగిస్తోంది. నా మనసును ముక్కలు చేస్తోంది అని చెప్పుకొచ్చారామె.
ట్రోల్స్ చేస్తూ చాలా అభ్యంతరకరంగా మాట్లాడడం వల్ల తాను ఆయనతో దిగిన ఫొటోలను తీసేశాను.. అని ఆమె చెప్పింది. అంతేకాదు మిగతావారు కూడా తనలాగా ఇబ్బందుల పాలు కాకుండా ఉండాలంటే తాము కూడా ఫొటోలు తొలగించాలని అభ్యర్థించింది. రాజకీయాల పరంగా, థరూర్ ఇటీవల కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడి మల్లికార్జున్ ఖర్గే చేతిలో ఓడిపోయారు.
త్వరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఆయన పేరు లేదు. గుజరాత్లోని పార్టీ విద్యార్థి విభాగం థరూర్ను ఆహ్వానించింది. ఆయనది భిన్నమైన వ్యక్తిత్వం. పార్టీ నాయకత్వం అతన్ని స్టార్ క్యాంపెయినర్గా పేర్కొనకపోవడంతో ఆయన కాస్త దూరంగా ఉన్నారు. అయితే సీనియర్ నేతను పక్కదారి పట్టిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు దీన్ని కొట్టిపారేస్తున్నాయి.