‘ఇప్పటి నుంచి అన్ని ఎన్నికల్లో శివసేన, బీజేపీ కలిసే పోటీ చేస్తాయి’
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు మొదలు లోక్ సభ ఎన్నికల వరకు శివసేన, బీజేపీ కలిసే పోటీ చేస్తాయని సీఎం ఏక్నాథ్ షిండే వెల్లడించారు. కేంద్ర మంత్రి అమిత్ షాతో ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్లు భేటీ అయ్యారు. అనంతరం, ఈ నిర్ణయాన్ని షిండే తెలిపారు.
న్యూఢిల్లీ: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ఇక పై అన్ని ఎన్నికలు శివసేన, బీజేపీ కలిసే పోటీ చేస్తాయని వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికలు మొదలు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలు జట్టుగానే పోటీ చేస్తాయని తెలిపారు. ఈ మేరకు శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే ట్విట్టర్లోనూ వెల్లడించారు.
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇరువురూ ఢిల్లీలో ఆదివారం రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. అమిత్ షాతో వీరిద్దరి ఫొటోనూ ఏక్నాథ్ సిండే ట్విట్టర్లో వెల్లడించారు. ఈ ఫొటో పోస్టు చేసి కామెంట్ ఇలా రాశారు.
ఈ సమావేశంలో భవిష్యత్ ఎన్నికల గురించి నిర్ణయాలు జరిగాయి. లోక్సభ, అసెంబ్లీ, మున్సిపల్ ఎన్నికలు అన్నింటిలోనూ శివసేన, బీజేపీ కలిసే పోటీ చేయాలనే నిర్ణయం జరిగినట్టు తెలిపారు. తాము కలిసి పోటీ చేసి మెజార్టీ సీట్లు గెలుచుకుంటామని పేర్కొన్నారు.
అలాగే, వ్యవసాయం, సహకారం పైనా చర్చ జరిగినట్టు సీఎం షిండే వివరించారు. పెండింగ్లో ఉన్న పలు ప్రాజెక్టుల గురించి చర్చించామని, త్వరలోనే ఆ ప్రాజెక్టులు పూర్తవుతాయని తెలిపారు.
అనేక ప్రాజెక్టుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గైడెన్స్ స్వీకరిస్తూనే ఉన్నామని సీఎం ఏక్నాథ్ షిండే తెలిపారు. సహకార రంగం గురించి చర్చించడానికి తాము అమిత్ షాను కలిసినట్టు వివరించారు.
Also Read: పొరుగు దేశం నుంచి కశ్మీర్కు మరో రూపంలో ముప్పు.. సరిహద్దు ఆవల నుంచి అడవి పందుల గుంపులు
గతేడాది అప్పటి ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివ సేనపై 39 ఎమ్మెల్యేలను వెంట పెట్టుకుని ఏక్నాథ్ షిండే తిరుగుబాటు చేశారు. ఆ తర్వాత శివసేన రెండుగా చీలిపోయింది. ఉద్ధవ్ ఠాక్రే సీఎం పదవికి రాజీనామా చేయగా.. ఏక్నాథ్ షిండే బీజేపీతో చేతులు కలిపి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.