sheena bora case : బైకుల్లా జైలు నుంచి ఇంద్రాణీ ముఖర్జీయా విడుదల .. ఆరున్నరేళ్ల తర్వాత బయటి ప్రపంచంలోకి
కూతురు హత్య కేసులో జైలులో వున్న ఇంద్రాణీ ముఖర్జీయాకు సుప్రీంకోర్ట్ బెయిల్ మంజూరు చేయడంతో ఆమె బైకూల్లా జైలు నుంచి దాదాపు ఆరున్నరేళ్ల తర్వాత విడుదలయ్యారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో (sheena bora case) నిందితురాలిగా వున్న ఇంద్రాణీ ముఖర్జీయాకి (indrani mukerjea) సుప్రీంకోర్ట్ (supreme court) బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో దాదాపు ఆరున్నరేళ్ల తర్వాత బైకుల్లా జైలు నుంచి ఆమె విడుదలయ్యారు. ఇంద్రాణీ ముఖర్జీయా 2015 నుంచి జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
Also Read:‘నా కూతురు షీనా బోరా బతికే ఉంది.. అక్కడ వెతకండి’.. సీబీఐకి Indrani Mukerjea సంచలన లేఖ..
‘‘మేము ఇంద్రాణి ముఖర్జీయాకు బెయిల్ మంజూరు చేస్తున్నాం. ఆరున్నర సంవత్సరాలు చాలా ఎక్కువ సమయం.. ఆమె ఇప్పటికే చాలా కాలం జైలు జీవితం గడిపినందున బెయిల్ పొందేందుకు అర్హులు. షరతులతో కూడిన బెయిల్ పొందేందుకు ఆమె అర్హులు. కేసు విచారణను ప్రభావితం చేసే మెరిట్లపై మేము ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం లేదు’’ అని బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. విచారణ త్వరగా పూర్తికాదని.. 50 శాతం మంది సాక్షుల వాంగ్మూలాలు ఇంకా నమోదు కాలేదని సుప్రీం పేర్కొంది. ఇది సందర్భోచిత సాక్ష్యాల కేసు అని కూడా న్యాయమూర్తులు గుర్తించారు.
ఇక, షీనా బోరా హత్య కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. 2012లో షీనా బోరా హత్యకు గురయ్యారు. అయితే షీనాను హత్య చేశారనే ఆరోపణలపై ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జీయా విచారణ ఎదుర్కొంటున్నారు. 2015 ఆగస్టు 25న ఇంద్రాణిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, 2015 సెప్టెంబర్ నుంచి ఆమె బైకుల్లా జైలులో ఉంటున్నారు. ఈ కేసులో ఇంద్రాణి మాజీ భర్త పీటర్ ముఖర్జీయా (peter mukerjea) , స్టార్ ఇండియా మాజీ సీఈవో సంజీవ్ ఖన్నా (sanjeev khanna) సహా నిందితులుగా ఉన్నారు. గతేడాది కోర్టు పీటర్కు బెయిల్ మంజూరు చేసింది.