పదకొండేళ్ల కుమార్తెను చంపి, ఆపై ఉరివేసుకున్న షేర్ బ్రోకర్.. కారణం ఏంటంటే..
మంగళవారం మధ్యాహ్నం లాల్బాగ్లోని గణేష్ గల్లిలోని తన ఇంట్లో పవార్ మొదట తన కుమార్తె ఆర్యను తాడుతో ఉరివేసి హత్య చేశాడు.
![Sharebroker who killed eleven-year-old daughter and then hanged himself in mumbai - bsb Sharebroker who killed eleven-year-old daughter and then hanged himself in mumbai - bsb](https://static-ai.asianetnews.com/images/01gne09qhkfb8jq9hxmeg51jv6/collage-maker-29-dec-2022-09-24-am_363x203xt.jpg)
ముంబై : 42 ఏళ్ల షేర్ బ్రోకర్ సెంట్రల్ ముంబై లోని తన ఇంట్లో ఉరి వేసుకుని మరణించాడు. దీనికంటే ముందు తన 11 ఏళ్ల కుమార్తెను తాడుతో గొంతు బిగించి చంపాడని పోలీసు అధికారులు బుధవారం తెలిపారు. హత్య-ఆత్మహత్య వెనుక గల కారణాలను పోలీసులు ఇంకా నిర్ధారించలేదు, అయితే స్టాక్ బ్రోకర్ భూపేష్ పవార్ తన భార్యను నిందిస్తూ రాసినట్లు భావిస్తున్న ఒక నోట్ను వారు స్వాధీనం చేసుకున్నారు.
మంగళవారం మధ్యాహ్నం లాల్బాగ్లోని గణేష్ గల్లిలోని తన ఇంటిలో పవార్ మొదట తన కుమార్తె ఆర్యను తాడుతో హత్య చేశాడు. ఆ తర్వాత అదే తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అధికారి తెలిపారు. ఆ సమయంలో పవార్ భార్య ఏదో పని మీద బయటకు వచ్చింది.
సాయంత్రం 4 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆమె తన భర్త, కుమార్తె మృతదేహాలను చూసిందని తెలిపారు. పవార్కు పరేల్ ప్రాంతంలో కార్యాలయం ఉందని అధికారి తెలిపారు. తండ్రీకూతుళ్ల మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించినట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా, మధ్యప్రదేశ్ లోని ధార్ లో షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. ధార్ జిల్లాలో 6 నుంచి 2 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు బావిలో తేలియాడుతున్నట్లు కనుగొన్నారు. ఈ మేరకు పోలీసులు ఈ రోజు వివరాలు తెలిపారు.
ఈ ఘటన ధార్ జిల్లాలోని సర్దార్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్యాంపుర ఠాకూర్ గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానిక గ్రామస్తులు మృతదేహాలను గుర్తించి బావిలో నుంచి బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఆ చిన్నారుల తల్లి కూడా బావిలో పడిందని, అయితే ఆమె మృతదేహం ఇంకా దొరకలేదని చెప్పారు.
సర్దార్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జి ప్రదీప్ ఖన్నా దీని మీద మాట్లాడుతూ.. జిల్లాలోని శ్యాంపుర గ్రామంలోని బావిలో ముగ్గురు అమ్మాయిలు, వారి తల్లి మునిగి చనిపోయారని మంగళవారం సాయంత్రం గ్రామ సర్పంచ్ నుండి మాకు కాల్ వచ్చింది. సమాచారం మేరకు, వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాం’ అన్నారు.
అయితే, పోలీసులు వెళ్లేసరికే.. అప్పటికే బావిలో నుంచి ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతదేహాలను గ్రామస్థులు వెలికితీశారు. "మహిళ మృతదేహం మాత్రం దొరకలేదు. ఆమె కోసం గజఈతగాళ్లు తీవ్రంగా వెతుకుతున్నారు. కానీ, ఇంకా మహిళ ఆచూకి దొరకలేదు" అన్నారాయన.
నివేదికల ప్రకారం, ఖిలేడి గ్రామానికి చెందిన ఈ పిల్లల తండ్రి జీవన్ బామ్నియా (32) మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో తన బంధువులలో ఒకరిని కలవడానికి గ్రామం నుండి బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చి చూడగా భార్య, ముగ్గురు కుమార్తెలు కనిపించ లేదు.
కొంత సేపటి వరకు వేచి చూసినా వారి గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఇతర కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలోనూ, చుట్టుపక్కలా వారి కోసం వెతకడం ప్రారంభించాడు. కొంతసేపటికి ఆ మహిళ ఊరి బయట మామిడికాయలు కోస్తూ కనిపించిందని గ్రామస్థులు తెలిపారు. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. ఆక్కడ వెతకగా వారిలో ఒకరు బావిలో ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు తేలుతుండడం గమనించారు. మృతదేహాలను బయటకు తీశారు. మృతులను అమృత (6), జ్యోతి (4), ప్రీతి (2)గా గుర్తించారు. కాగా, వారి తల్లి రంజన కనిపించకుండా పోయిందని పోలీసులు తెలిపారు.