పలువురు మంత్రుల రాజీనామా: నేడే కేంద్ర మంత్రివర్గ విస్తరణ
కేంద్ర మంత్రివర్గాన్ని మోడీ బుధవారం నాడు విస్తరించనున్నారు. ఈ నేపథ్యంలో కొందరు కేంద్ర మంత్రి పదవులకు రాజీనామాలు చేశారు.
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గాన్ని మోడీ బుధవారం నాడు విస్తరించనున్నారు. ఈ నేపథ్యంలో కొందరు కేంద్ర మంత్రి పదవులకు రాజీనామాలు చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ తన పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో మంత్రి పదవికి రాజీనామా చేసినట్టుగా ఆయన ప్రకటించారు. కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ కూడ తన పదవికి రాజీనామా చేశారు. మరో కేంద్ర మంత్రి సదానందగౌడ కూడ తన పదవికి రాజీనామా సమర్పించారు. సంజయ్ దోంత్రే, ధన్విపాటిల్, దేభశ్రీ చౌధురి కూడ తమ మంత్రి పదవులకు రాజీనామా సమర్పించారు.
also read:తెలుగు రాష్ట్రాలకు సున్నా: మోడీ మంత్రివర్గంలో కొత్తగా చేరేవారి జాబితా ఇదే
ఇవాళ కేంద్ర మంత్రివర్గంలోకి 21 మంది కొత్త ముఖాలను మోడీ తీసుకొనే అవకాశం కన్పిస్తోంది. త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని కొత్త టీమ్ ను మోడీ ఎంపిక చేసుకొన్నారు. కొత్త టీమ్ సభ్యులు ఇవాళ ప్రమాణం చేయనున్నారు.
43 మంది కేంద్ర మంత్రులుగా ఇవాళ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం.27 మంది మాజీ మంత్రులకు కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉంది. కొత్తగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించే వారిలో 27 మంది ఓబీసీలకు ఛాన్స్ దక్కనుంది.ప్రస్తుతం హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి, ఆర్ధిక శాఖ సహాయమంత్రిగా ఉన్న అనురాగ్ ఠాకూర్ లకు ఇండిపెండెంట్ హోదాతో కేబినెట్ బెర్త్ దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. జ్యోతిరాదిత్య సింధియా, కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్ తదితరులు ఇవాళ ప్రధాని నివాసానికి వెళ్ళి మోడీతో భేటీ అయ్యారు.