తెలుగు రాష్ట్రాలకు సున్నా: మోడీ మంత్రివర్గంలో కొత్తగా చేరేవారి జాబితా ఇదే
ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గ విస్తరణ ఈ రోజు లేదా రేపు జరిగే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు మంత్రివర్గంలో చోటు దక్కేవారి పేర్లు అధికారికంగా వెల్లడి కానున్నాయి.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలోకి తెలుగు రాష్ట్రాల నుంచి కొత్తగా చేరేవారు ఎవరూ లేరు. మంత్రివర్గ విస్తరణలో మోడీ తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఇవ్వడం లేదు. తెలంగాణ నుంచి జి. కిషన్ రెడ్డి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హరిబాబుకు గవర్నర్ పదవి ఇచ్చారు. తెలంగాణ నుంచి బండారు దత్తాత్రేయ గవర్నర్ గా కొనసాగుతున్నారు.
ఈ రోజు బుధవారం సాయంత్రం ఆరు గంటలకు కొత్త మంత్రుల జాబితాపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఓబీసీలకు, షెడ్యూల్ కులాలవారికి మంత్రివర్గంలో ఎక్కు ప్రాధాన్యం లభించబోతోంది. కొత్త మంత్రులు ఈ రోజు లేదా రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
విస్తరణలో 15 నుంచి 20 మంది ఎస్సీ, ఓబీసీ, ఇతర చిన్న సామాజిక గ్రూపుల నుంచి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మహిళల ప్రాతినిధ్యం కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. ఉన్నత విద్యలు అభ్యసించినవారికి విస్తరణలో అవకాశం కల్పిస్తారని అంటున్నారు. పిహెచ్ డీలు చేసినవారు, పోస్టు గ్రాడ్యుయేట్స్ మంత్రివర్గంలో చోటు దక్కించుకుంటారని భావిస్తున్నారు.
కొత్తగా నరేంద్ర మోడీ మంత్రివర్గంలో చేరేవారు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ప్రస్తుత విస్తరణతో మోడీ మంత్రివర్గ సభ్యుల సంఖ్య 53 నుంచి 81కి పెరుగుతుంది. ఐదు రాష్ట్రాల్లో జరిగే శాసనసభ ఎన్నికలను కూడా మంత్రివర్గ విస్తరణలో దృష్టిలో పెట్టుకుంటున్నారు.
జాబితా ఇదే....
జ్యోతిరాదిత్య సింధియా (మధ్యప్రదేశ్)
శర్వానంద్ సోనోవాల్ (అస్సాం)
సుశీల్ మోడీ (బీహార్)
పశుపతి నాథ్ పరాస్ (ఎల్జెపీ)
ఆర్సీపీ సింగ్ లేదా లలన్ సింగ్ (జేడియూ)
అనుప్రియ పటేల్ (అప్నాదళ్)
రీటా బహుగుణ జోషి
అజయ్ భట్
నారాయణ్ రానే (మహారాష్ట్ర)
హీనా గవిట్ (మహారాష్ట్ర)
వరుణ్ గాంధీ (ఉత్తరప్రదేశ్)
ప్రతాప్ సిన్హా (కర్ణాటక)
బిజేంద్ర సింగ్ (హర్యానా)
ప్రవేశ్ వర్మ
జాఫర్ ఇస్లాం
అశ్విన్ వైష్ణవ్ (ఒడిశా)