రాష్ట్రంలో ఏడుగురు విద్యార్థులు అదృశ్యం..కారణం అదేనా?
చదువు వద్దంటే వద్దని, క్రీడలే కావాలని బెంగళూరులోని విద్యార్థులు ఇంటి నుంచి పారిపోయారు. ఉదయం ఇంటి నుంచి స్కూల్కు వెళ్తున్నామని బయల్దేరి మళ్లీ సాయంత్రం తిరిగి ఇంటికి రాలేదు. ఇంటి వద్ద లభించిన ఓ లేఖలో తమకు చదువుకోవడం ఇష్టం లేదని రాసిపెట్టారు. అందుకే ఇల్లు వదిలివెళ్లిపోతున్నట్టు పేర్కొన్నారు.
బెంగళూరు: చిన్నప్పుడు పిల్లలు మారాం చేయడం సహజం. ముఖ్యంగా స్కూల్కు వెళ్లడమంటే అసలే ఒప్పుకోరు. రోజూ ఉదయం వారితో ఓ అరగంట కాలం గడపాల్సిందే. అలాగైతేనే.. స్కూల్కు వెళ్లేది మరి. స్కూల్ టైం అవ్వగానే వచ్చి ఆటల్లో మునిగితేలుతారు. కానీ, కర్ణాకటలోని బెంగళూరులో ఏడుగురు విద్యార్థులు తమకు చదవడం ఇష్టం లేదని, ఆటలే కావాలని ఏకంగా ఇంటి నుంచే పారిపోయారు. బెంగళూరు బాగలగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఉదయం పాఠశాలకు వెళ్తున్నామని వెళ్లిన విద్యార్థులు మళ్లీ ఇంటికి తిరిగిరాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే వారి ఇంటిలో ఓ లేఖ లభించింది. అందులో ‘మాకు చదువులంటే ఇష్టం లేదు. ఆటలంటేనే ప్రేమ అని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఎంత ఒత్తిడి తెచ్చినా చదవాలని ఆసక్తి వారికి కలుగడం లేదని స్పష్టం చేశారు. అందుకే క్రీడలే తమ కెరీర్గా ఎంచుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. మంచి పేరు, హోదా, డబ్బులు సంపాదించిన తర్వాత తిరిగి వస్తామని తెలిపారు. అంతేకాదు, వాళ్ల కోసం ఆందోళన చెందవద్దని, ఎక్కడా వెతకవద్దని సూచించారు.
పరీక్షిత్, నందన్, కిరణ్ అనే ముగ్గురు విద్యార్థులు ఒకే పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. వీరు ముగ్గురు ఇప్పుడు మిస్సింగ్లో ఉన్నారు.
Also Read: అమీర్పేట్లో ఏడో తరగతి విద్యార్థిని అదృశ్యం.. !
వీరి ఇళ్లకు సమీపంలోనే మరో చోట ఓ 21ఏళ్ల యువతి, మరో ముగ్గురు కనిపించకుండా పోయారు. అమృత వర్షిణి అనే యువతి, టీనేజీ పిల్లలు సిద్దార్థ్, చింతన్, భూమిలు కూడా కనపడటం లేదు. వీరిలో ఒకరి ఇంట్లో కూడా ఓ లెటర్ లభించింది. అందులో చెప్పులు, టూత్ బ్రష్, టూత్ పేస్ట్, వాటర్ బాటిల్, క్యాష్, క్రీడా వస్తువులు వెంట తీసుకెళ్లాలని రాసి ఉన్నది. ఈ కేసులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.