కాంగ్రెస్ సీనియర్ నేత అస్కార్ ఫెర్నాండెజ్ కన్నుమూత
మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అస్కార్ ఫెర్నాండెజ్ సోమవారం నాడు అనారోగ్యంతో కన్నుమూశారు. గత ఏడాది జూన్ నుండి ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన ఇవాళ మరణించారు.
న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అస్కార్ ఫెర్నాండెజ్ సోమవారం నాడు కన్నుమూశారు. కర్ణాటక రాష్ట్రంలోని యెనెపోయ ఆసుపత్రిలో కొంత కాలంగా ఆయన చికిత్స పొందుతున్నారు. గత ఏడాది జూన్ 18వ తేదీన ఆయన అస్వస్థతకు గురయ్యారు. యోగా చేస్తున్న సమయంలో స్పృహ కోల్పోయాడు. అయితే ఆయనకు బ్రెయిన్ సర్జరీ కూడ నిర్వహించారు. కానీ ఆయన కోలుకోలేదు.
రెండు రోజుల క్రితం రాజ్యసభలో కాంగ్రెస్ పక్షనేత మల్లిఖార్జునఖర్గే ఆస్కార్ ఫెర్నాండెజ్ ను ఆసుపత్రిలో పరామర్శించారు.ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. రాహుల్ గాంధీ, సోనియాగాంధీలు అస్కార్ ఫెర్నాండెజ్ తో ఫోన్ లో మట్లాడారు.
కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అస్కార్ ఫెర్నాండెజ్ రోడ్లు, రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు. కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి ఎంపీ స్థానం నుండి ఫెర్నాండెజ్ ఎంపీగా 1980లో తొలిసారిగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత మరో నాలుగు దఫాలు ఆయన కర్ణాటక సీటు నుండి విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో ఆయన ఎంపీగా ఓటమి పాలు కావడంతో ఆయనను కాంగ్రెస్ పార్టీ ఫెర్నాండెజ్ ను రాజ్యసభకు నామినేట్ చేసింది.