ములుగు సీతక్కకు ఇంకో పోస్టు
కీలక బాధ్యతలు
కాంగ్రెస్ నాయకురాలు, ములుగు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సీతక్క అలియాస్ దనసరి అనసూయకు మరో పోస్టు దక్కింది. ఇప్పటికే ఆమె ఎఐసిసి మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ పార్టీ.
తాజాగా ఆమెను మరో పోస్టు వరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఇన్ ఛార్జిగా నియమిస్తూ మంగళవారం ఆదేశాలు వెలువడ్డాయి. ఇప్పటి వరకు ఎపి మహిళా కాంగ్రెస్ కు హజీనా సయ్యద్ అనే నాయకురాలు ఇన్ఛార్జిగా ఉండేవారు. ఆమె స్థానంలో సీతక్కను నియమిస్తూ ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఎంపి సుష్మితా దేవ్ ఉత్తర్వులు వెలువరించారు.
ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా మహిళా కాంగ్రెస్ ను సీతక్క కొత్త పుంతలు తొక్కిస్తారా? అన్నది చూడాలి. ఎందుకంటే అక్కడ ఉన్నది టిడిపి ప్రభుత్వం. టిడిపి అధినేత చంద్రబాబే సీతక్కను రాజకీయాల్లోకి టికెట్ ఇచ్చి ఆహ్వానించారు. ఒకవేళ రానున్న ఎన్నికల్లో టిడిపి కాంగ్రెస్ కలిసే పరిస్థితి వస్తే సీతక్కకు పెద్దగా కష్టం ఉండకపోవచ్చు.