పంజాబ్లో రాష్ట్రంలో మరోసారి వీవీఐపీకి భద్రతా వైఫల్యం ఎదురైంది. పంజాబ్ సీఎం ఫేస్ ప్రకటించడానికి నిన్న లూధియానాకు వెళ్తుండగా రాహుల్ గాంధీ కాన్వాయ్పై రోడ్డుపక్కనే ఉన్న గుంపులో నుంచి ఓ వ్యక్తి జెండా విసిరేశారు. ఆ జెండా కారు విండో ద్వారా లోనికి వెళ్లి రాహుల్ గాంధీకి తగిలినట్టు సమాచారం. కానీ, ఈ ఘటనపై పెద్దగా చర్చ జరగలేదు.
చండీగడ్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi)కి పంజాబ్(Punjab)లో చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఆయనకు భద్రతా వైఫల్యం(Security Breach) ఎదురుకావడంతో సుమారు 20 నిమిషాలు ఓ ఫ్లై ఓవర్పైనే కారులో ఉండిపోవాల్సి వచ్చింది. ఆయన తన కార్యక్రమానికి హాజరవ్వకుండానే అర్థంతరంగా వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ఘటన కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో గత నెలలో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పంజాబ్ దేశ సరిహద్దు రాష్ట్రమన్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్తో ఈ రాష్ట్ర సరిహద్దు పంచుకుంటున్నది. ఇదిలా ఉండగా, తాజాగా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి కూడా అక్కడ భద్రతా లోపం ఎదురైంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.
రాహుల్ గాంధీ నిన్న పంజాబ్ సీఎం ఫేస్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన నిన్న లూధియానాకు వెళ్లారు. సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీని కాంగ్రెస్ సీఎం క్యాండిడేట్గా రాహుల్ గాంధీ ప్రకటించడానికి ముందు ఆయన లూధియానా చేరుకుని పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ చీఫ్ సునీల్ జాఖర్, సీఎం చరణ్ జిత్ సింగ్, ప్రస్తుత పంజాబ్ ప్రదేశ్ కమిటీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్దూలతో కలిసి కారులో ప్రయాణించారు. సునీల్ జాఖర్ కారు నడుపుతూ ఉంటే.. వెనక సీట్లలో సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ, నవజోత్ సింగ్ సిద్దూలు కూర్చుని ఉండగా.. ముందు సీట్లో రాహుల్ గాంధీ కూర్చుని ఉన్నారు. వారి కాన్వాయ్ లూధియానాలో నిర్వహించాల్సిన ర్యాలీ వద్దకు వెళ్తుండగా అనుకోని ఘటన జరిగింది.
రాహుల్ గాంధీ కాన్వాయ్కు స్వాగతం పడుతున్నట్టుగా కొందరు నిలుచుని ఉన్నారు. ఆ గుంపులోని కొందరు రాహుల్ గాంధీ కారు రాగానే ఓ జెండాను ఆ కారుపైకి విసిరేశారు. ప్రజలకు అభివాదం చెప్పడానికి కారు విండో ఓపెన్ చేసి పెట్టుకోవడంతో ఆ జెండా నేరుగా రాహుల్ గాంధీకి తగిలింది. ఆ జెండా రాహుల్ ముఖానికి తగిలి ఉండే అవకాశం ఉన్నట్టు వీడియో ద్వారా తెలుస్తున్నది. అదే గుంపు దగ్గర కొందరు పోలీసులు కూడా కనిపించారు. కానీ, వారు అంతగా అప్రమత్తంగా లేనట్టు కనిపించారు. కారుపై జెండా విసిరేసినా.. ఆ పోలీసులు మెల్లిగా నడుస్తూ వస్తున్నట్టు వీడియోలో కనిపించారు. అయితే, జెండా విసిరేసిన వ్యక్తిని పట్టుకున్నట్టు సమాచారం. కానీ ఆ తర్వాతే వెంటనే వదిలిపెట్టినట్టు తెలిసింది.
కానీ, ఈ ఘటన బయటకు ఎక్కువగా పొక్కకపోవడంతో చర్చ జరగలేదు. కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉండటంతో దాన్ని హైలైట్ కాకుండా చూసుకున్నట్టు కొందరు ఆరోపిస్తున్నారు.
గత నెల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన పంజాబ్ పర్యటన(Punjab Visit) దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. భటిండా నుంచి ఫెరోజ్పుర్కు రోడ్డు మార్గాన వెళ్లుతుండగా రైతులు ఆందోళన చేయడం.. సుమారు 20 నిమిషాలు ప్రధాన మంత్రి ఓ ఫ్లై ఓవర్పై నిలిచిపోవాల్సి వచ్చింది. భద్రతా లోపం(Security Breach) ఏర్పడ్డ కారణంగా ఆయన అక్కడి నుంచి భటిండాకే వెనుదిరిగి వెళ్లిపోయారు. భటిండా దాకా ప్రాణాలతో చేరగలిగానని, సీఎంకు థాంక్స్ చెప్పాలని ప్రధాని మోడీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం మండిపడింది. పంజాబ్ ప్రభుత్వం ఎస్వోఎస్ ప్రోటోకాల్ పట్టించుకోలేదని ఆగ్రహించింది.
