ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఐదో తరగతి బాలికను విసిరేసిన టీచర్.. ఢిల్లీలో ఘటన
ఢిల్లీలో ఓ టీచర్ ఐదో తరగతి చదువుతున్న బాలికను ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు విసిరేసింది. కత్తెర్లతో దాడి చేసి ఆ తర్వాత కిందకు విసిరేసింది. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.
న్యూఢిల్లీ: క్లాసు రూమ్లో పాఠాలు బోధించి మంచి నడవడికను పిల్లలకు బోధించాల్సిన ఓ టీచర్.. కోపంలో తానే తప్పటడుగు వేసింది. ఐదో తరగతి చదువుతున్న బాలికను ఫస్ట్ ఫ్లోర్లోని తరగతి గది నుంచి కిందికి విసిరేసింది. ఈ ఘటన ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో ఉదయం 11.15 గంటలకు చోటుచేసుకుంది. తీవ్ర గాయాలపాలైన బాలికను హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆమె ప్రస్తుతం ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిందని వైద్యులు చెప్పారు.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రభుత్వ పాఠశాలలో గీతా దేశ్వాల్ టీచర్గా పని చేస్తున్నారు. ఆమె ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిని వందనను కొట్టింది. కాగితాలు కత్తిరించే కత్తెర్లతో దాడి చేసింది. ఆ తర్వాత అదే కోపంలో ఆమెను తరగతి గది నుంచి బయటకు విసిరేసింది. ఈ ఘటన రాణి ఝాన్సి రోడ్ సమీపంలో మాడల్ బస్తీకి ఎదురుగా ఉన్న ఢిల్లీ నగర్ నిగమ్ బాలిక విద్యాలయ లో చోటుచేసుకుంది.
గీత దేశ్వాల్ ఆ బాలికను కొడుతుంటే తోటి ఉపాధ్యా యురాలు రియా అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ, ఆమె అంత లోపే బాలికను కిందికి విసిరేసింది. అక్కడే ఉన్న కొందరు ఆ బాలికను దగ్గరకు తీసుకున్నారు. పోలీసులకు ఫోన్ చేశారు. అనంతరం, ఆమెను బారా హిందూ రావు హాస్పిటల్ కు తీసుకెళ్లారు.
Also Read: జార్ఖండ్లో స్కూల్కు హాజరైన కోతి.. విద్యార్థులతోపాటు పాఠాలు విన్న వానరం.. వీడియో వైరల్
ఉదయం 11.15 గంటల ప్రాంతంలో పీఎస్ డీబీజీ బీట్ ఆఫీసర్ ఈ సమాచారం రిసీవ్ చేసుకున్నారని ఓ అధికారి ప్రకటనలో వెల్లడించారు. పోలీసులు వెంటనే స్పాట్కు వెళ్లారు. పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చారు.
నిందితురాలు గీతా దేశ్వాల్ను అదుపులోకి తీసుకున్నారు. సాక్షులు ఇచ్చిన సమాచారం మేరకు ఆమె పై ఐపీసీలోని 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
టీచర్ తనను కత్తెర్లతో కొట్టిందని, ఆ తర్వాత కిందకు విసిరేసిందని.. చికిత్స పొందుతున్న ఆ బాలిక ఏడుస్తూ తెలిపింది.