తిట్టడానే కోపంతో ప్రిన్సిపాల్ పై నాటు తుపాకీతో విద్యార్థి కాల్పులు.. పరిస్థితి విషయం
ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్లో దారుణం జరిగింది. కాలేజీలో అందరి మందు మందలించాడనే కోపంతో ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్థి కాలేజీ ప్రిన్సిపాల్పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ప్రిన్సిపాల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తనని తిట్టడానే కోపంతో నాటు తుపాకీ తో ఓ విద్యార్థి కాలేజీ ప్రిన్సిపాల్పై కాల్పులు జరిపాడు. నిందిత విద్యార్థి ప్రిన్సిపాల్పై మూడు రౌండ్లు కాల్పులు జరిపి తుపాకీతో పారిపోయాడు. ఈ ఘటనలో ప్రిన్సిపాల్ పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా ఆస్పత్రి వైద్యులు లక్నోలోని ట్రామా సెంటర్కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లా జహంగీరాబాద్ పట్టణంలోని ఆదర్శ్ రామ్ స్వరూప్ అనే ఇంటర్ కాలేజీ ఉంది. డాన్పూర్వా గ్రామానికి చెందిన రామ్ సింగ్ వర్మ అనే వ్యక్తి ఆ కాలేజీకి ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తున్నారు. అయితే.. శుక్రవారం నాడు కాలేజ్ లో ఇంటర్ చదువుతున్న గుర్విందర్ సింగ్, రోహిత్ మౌర్య అనే విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. ఆ విషయం ప్రిన్సిపాల్ దృష్టి వెళ్లడంతో జోక్యం చేసుకున్నారు. ఆ ఇద్దరి విద్యార్థులను కాలేజీ ప్రాంగణంలో అందరి ముందు మందలించారు. అంతటితో ఆ విషయం సద్దుమణిగింది. కానీ.. గుర్విందర్ సింగ్ అనే విద్యార్థి మాత్రం అవమానంగా భావించాడు. ఎలాగైనా ప్రిన్సిపాల్ మీద పగ తీర్చుకోవాలని అనుకున్నాడు.
మరుసటి రోజు (శనివారం) ఉదయం 8 గంటల ప్రాంతంలో ప్రిన్సిపాల్ రామ్ సింగ్ వర్మ పాఠశాల బయట నిర్మిస్తున్న దుకాణాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో గుర్విందర్ సింగ్ తన బ్యాగ్ నుంచి నాటు తుపాకీని తీసుకొచ్చి.. ప్రిన్సిపాల్ రామ్ సింగ్ వర్మపైకి గురిపెట్టాడు. వరుసగా మూడు సార్లు కాల్చాడు. ఈ ఘటనలో ప్రిన్సిపాల్ రామ్ సింగ్ వర్మ తీవ్రంగా గాయపడ్డారు. తొలుత సీతాపూర్ జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. అయితే.. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని అక్కడ నుండి లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ లోని ట్రామా సెంటర్కు రిఫర్ చేశారు.
ఉదయం 8 గంటల ప్రాంతంలో ప్రిన్సిపాల్ తన కార్యాలయం వైపు వెళుతుండగా కళాశాల ప్రవేశ ద్వారం వద్ద ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. పాఠశాల గేటు వద్ద ప్రిన్సిపాల్ కోసం దుండగుడు వేచి ఉన్నాడని, అతడిని చూడగానే కాల్పులు జరిపాడని తెలిపారు. స్థానికులు చూడగానే.. ఆ విద్యార్థి అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు. శుక్రవారం 12వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలురను స్కూల్ గేటు ముందు ప్రిన్సిపాల్ తిట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. బాలుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నామని, అతడిని వెతికి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.
తుపాకీ ఎలా వచ్చింది..?
గొడవ జరిగిన ఒక్కరోజులోనే నిందిత విద్యార్ధి వద్దకు ఆయుధం ఎలా వచ్చిందన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు కుటుంబ సభ్యులను కూడా విచారించడం ప్రారంభించారు. గొడవ జరగడంతో విద్యార్థిని తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు బంధువులు చెబుతున్నారు. ఆయుధం ఎక్కడి నుంచి వచ్చిందన్న సమాచారం మాత్రం ఇంకా తెలియలేదు. ఇదిలాఉంటే.. పోలీసుల తీరుపై గ్రామస్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే.. ఈ ప్రమాదం జరగకుండా ఉండేదని గ్రామస్తులు అంటున్నారు. ప్రస్తుతం ప్రిన్సిపాల్ పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు.