‘చికిత్స కోసం విదేశాలకు వెళ్లకూడదని జయలలిత నిర్ణయించుకున్నారు ‘
చెన్నైలో వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయని మాజీ ముఖ్యమంత్రి జయలలిత భావించి వైద్యం కోసం విదేశాలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారని దివంగత సీఎం మాజీ సన్నిహితురాలు వీకే శశికళ పేర్కొన్నారు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంపై విచారణకు ఏర్పాటైన ఐదేళ్ల తరువాత ఆర్ముగస్వామి కమిషన్ తన నివేదికను ఈ యేడాది ఆగస్టు 25న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు సమర్పించిన విషయం తెలిసిందే. అయినా.. జయలలిత మరణం మిస్టరీనే. సందర్భం వచ్చినప్పుడల్లా డీఎంకే నేతలు గానీ, అన్నా డీఎంకే నేతలు గానీ కీలక వ్యాఖ్యలు చేస్తునే ఉంటారు.
తాజాగా దివంగత ముఖ్యమంత్రికి ఆప్తమిత్రురాలు, అన్నాడీఎంకే (ఏఐడీఎంకే) నేత వీకే శశికళ జయలలిత మరణంపై ఓ కీలక వ్యాఖ్య చేశారు. ఆమె శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. చెన్నైలో వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని భావించిన జయలలిత చికిత్స కోసం విదేశాలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారని తెలిపింది. జయలలిత మృతి కేసులో దాచేది లేదని, జయలలితకు చిక్సిత చేసిన విదేశీ వైద్యులు ఆమెను చికిత్స కోసం విదేశాలకు తరలించేందుకు ప్రయత్నించారని శశికళ తేల్చిచెప్పారు. చెన్నై మెడికల్ హబ్ అని, నగరంలో అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మేము ఆమెను విదేశాలకు తీసుకెళ్లాలని అనుకున్నప్పటికీ, చెన్నైలో చికిత్స పొందాలని జయలలిత నిర్ణయించారనీ తెలిపారు. జయలలిత 2016లో ఇక్కడి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు.
అరుముగస్వామి కమిషన్
జయలలిత మరణంపై పలు అనుమానాలు వ్యక్తం కావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం మాజీ జడ్జి అరుముగస్వామి అధ్యక్షతన ఓ కమిషన్ ని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఐదేళ్ల తరువాతతన నివేదికను (ఈ యేడాది ఆగస్టు 25న) తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు సమర్పించింది. ఈ నివేదికలో ఆర్ముగస్వామి పలు విషయాలను వెల్లడించాడు. జయలలిత మరణంపై విచారణ చేపట్టాలని మాజీ జడ్జి అరుముగస్వామి అభిప్రాయపడ్డారు. జయలలిత ఏ రోజున, ఎన్ని గంటలకు మరణించిందనే విషయాన్ని కూడా తెలిపారు. అయితే జయ మరణంపై అపోల్ హాస్పిటల్ ఇచ్చిన స్టేట్మెంట్ సరిగా లేదని పేర్కోన్నారు.
అపోలో నివేదిక ప్రకారం.. 2016 డిసెంబర్ 5 తేదీ రాత్రి 11.30 నిమిషాలకు జయ లలిత తుది శ్వాస విడిచారు. వార్త కథనాలు, ఆస్పత్రి నివేదికల్లో తేడాలు ఉండటంతో వివాదం చెలరేగుతోంది. జయ మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే.. మాజీ సీఎం జయ లలితకు, ఆమె స్నేహితురాలు శశికళ మధ్య సంబంధాలు సరిగా లేవనీ, వారి మధ్య 2012 నుంచి గొడవలు జరిగినట్టు మాజీ జడ్జి తన రిపోర్ట్లో ఆరోపించారు.
అదే సమయంలో శశికళ, డాక్టర్ కేఎస్ శివకుమార్, ఆనాటి ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్, ఆరోగ్య మంత్రి సీ విజయభాస్కర్ వ్యవహర శైలిని కమిషన్ తప్పుపట్టింది. వీరిపై విచారణ చేపట్టాలని కమిషన్ పేర్కొంది. అపోల్ హాస్పిటల్లో ఉన్న జయలలితకు ఎయిమ్స్ వైద్యుల బృందం సరైన వైద్యం అందించలేదని, అమెరికా నుంచి వచ్చిన డాక్టర్ సమీన్ శర్మ.. మాజీ సీఎంజయకు హార్ట్ సర్జరీ చేయాలని సూచించారనీ, కానీ ఆ సర్జరీ జరగలేదని అరుముగస్వామి కమిషన్ ఆరోపించింది.