పోలీసు స్టేషన్ ప్రాంగణంలోనే బీజేపీ నేతపై దాడి చేసిన సమాజ్వాదీ ఎమ్మెల్యే.. వైరల్ వీడియో ఇదే
పోలీసు స్టేషన్ ప్రాంగణంలోనే ఎస్పీ ఎమ్మెల్యే రాకేశ్ ప్రతాప్ సింగ్.. బీజేపీ నేత దీపక్ సింగ్ పై భౌతిక దాడికి దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అమేథీ: ఉత్తరప్రదేశ్లోని ఓ పోలీసు స్టేషన్లో బుధవారం ఊహించని ఘటన జరిగింది. పోలీసు స్టేషన్ ప్రాంగణంలోనే బీజేపీ నేతపై సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే పిడిగుద్దులు కురిపించాడు. వెంటనే ఆయన మద్దతుదారులు కూడా తోడై ఆ బీజేపీ నేతపై విరుచుకుపడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. కానీ, వారిని వేరు చేయడం అంత సులువుగా జరగలేదు. ఈ ఘటన యూపీలోని అమేథీలో గౌరిగంజ్ కొత్వాలీ పోలీసు స్టేషన్లో బుధవారం జరిగింది. ఈ ఘటన జరుగుతుండగా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే రాకేశ్ ప్రతాప్ సింగ్, ఆయన మద్దతుదారుల దాడి చేశారు. బీజేపీ మున్సిపల్ ఎలక్షన్ క్యాండిడేట్ రష్మి సింగ్ భర్త దీపక్ సింగ్ పై భౌతిక దాడికి దిగారు.
సమాజ్వాదీ పార్టీ లీడర్ రాకేశ్ ప్రతాప్ సింగ్ వివరణ ప్రకారం, దీపక్ సింగ్, ఆయన అనుచరులు రాకేశ్ ప్రతాప్ సింగ్ అనుచరులపై దాడి చేశారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా.. వారు యాక్షన్ తీసుకోలేదు. దీంతో రాకేశ్ ప్రతాప్ సింగ్ మరికొందరు మద్దతుదారులు గౌరిగంజ్ కొత్వాలీ పోలీసు స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు.
అదే సమయంలో అక్కడికి దీపక్ సింగ్ వచ్చాడు. వచ్చి రాకేశ్ ప్రతాప్ సింగ్ను దూషించాడు. ఆయన మద్దతుదారులపైనా నోరు పారేసుకున్నాడు. ఇది విని అక్కడే ఉన్న రాకేశ్ ప్రతాప్ సింగ్ వేగంగా వచ్చాడు. పోలీసుల వెనుక నుంచి వచ్చి దీపక్ సింగ్ పై దాడికి తెగబడ్డాడు. ఆయన మద్దతుదారులు కూడా దీపక్ సింగ్ పై దాడి చేశారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని విడగొట్టడానికి కొంత సమయం పట్టింది.
ఇప్పుడు వారిని వేరు చేశామని, ఇద్దరిపైనా లీగల్ యాక్షన్ తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇద్దరిపైనా కేసులు నమోదయ్యాయని వివరించారు.