18 మాసాల కనిష్టానికి చేరువలో రూపాయి
మరోసారి బలహీనపడిన రూపాయి
న్యూఢిల్లీ: రూపాయి మరోసారి పతనాన్ని నమోదు చేసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 18 మాసాల కనిష్టానికి చేరుకొంది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ట్రేడింగ్ ప్రారంభంలోనే 29 పైసలు పతనమై 68.68 ను తాకింది.
దీంతో 2016, నవంబరు నాటి స్థాయికి పతనమైంది. తదుపరి కొంతమేర కోలుకుని అంటే 23 పైసల నష్టంతో 68.47కు చేరింది. తిరిగి డాలర్లకు డిమాండ్ పెరగడంతో మంగళవారం నాటి ముగింపు 68.24తో పోలిస్తే 35 పైసలు నీరసించి 68.60 వద్ద ఉంది. అయితే 69 స్థాయి చాలా కీలకమని ట్రేడర్లు చెప్పారు. ఆర్బీఐ కల్పించుకోకపోతే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ప్రపంచవ్యాప్త వాణిజ్య భయాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 0.3 శాతం పుంజుకుంది. డాలరు ఇండెక్స్ 94.70కు బలపడింది. దీనికితోడు దేశీయంగా స్టాక్స్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యమిస్తుండటం కూడా రూపాయిని బలహీనపరుస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.