శబరిమలలోకి మహిళలు.. హిందూ సంఘాల ఆందోళన
శతాబ్దాలుగా అనుసరిస్తోన్న సంప్రదాయాన్ని నిర్వీర్యం చేయడానికి చేసే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని పేర్కొన్నారు.
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళలు ప్రవేశించవచ్చు అంటూ ఇటీవల సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం తీర్పునకు అనుగుణంగా కేరేళ ప్రభుత్వం కూడా మహిళలను ఆలయంలోనికి అనుమతించింది. కాగా.. దీనిపై తీవ్ర దుమారమే రేగింది.
మహిళలకు ప్రవేశాన్ని కల్పిస్తూ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడంతో హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. విజయన్ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ శ్రీరామసే, హనుమాన్ సేన, అయ్యప్ప ధర్మసేనలు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి.
ఈ సందర్భంగా అయ్యప్ప ధర్మసేన ప్రతినిధులు మాట్లాడుతూ.. శతాబ్దాలుగా అనుసరిస్తోన్న సంప్రదాయాన్ని నిర్వీర్యం చేయడానికి చేసే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని పేర్కొన్నారు. హిందూ సంఘాలు హర్తాళ్లతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటుచేసింది. మరోవైపు ఆర్ఎస్ఎస్ మాత్రం ఈ ఆందోళనకు దూరంగా ఉంటామని ప్రకటించింది.
ఆలయానికి సంబంధించిన సున్నితమైన విషయాన్ని వీధుల్లోకి లాగడం తమకు ఇష్టం లేదని ఆర్ఎస్ఎస్ కేరళ ప్రతినిధి గోపాలన్ కుట్టి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వివాదం గురించి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరిస్తోందని, దీనిపై తుది నిర్ణయం తర్వాత ఇంకా వెలువడలేదని అన్నారు.