construction workers: నిర్మాణ కార్మికులకు గుడ్ న్యూస్.. ఒక్కొక్కరి ఖాతాలో రూ. 5 వేలు.. ఎక్కడంటే..?
నిర్మాణ కార్మికులకు (construction workers) ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Delhi CM Arvind Kejriwal) గుడ్ న్యూస్ చెప్పారు. నిర్మాణ కార్మికులు ఒక్కొక్కరి ఖాతాలో రూ. 5 వేలు జమ చేయాలని గురువారం ఆదేశాలు ఇచ్చినట్టుగా వెల్లడించారు.
నిర్మాణ కార్మికులకు (construction workers) ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Delhi CM Arvind Kejriwal) గుడ్ న్యూస్ చెప్పారు. ఢిల్లీలో వాయు కాలుష్యం (air pollution) కారణంగా నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం ఉన్నందుకు ఆ రంగంలోని కార్మికుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్టుగా వెల్లడించారు. నిర్మాణ కార్మికులు ఒక్కొక్కరి ఖాతాలో రూ. 5 వేలు జమ చేయాలని గురువారం ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలిపారు. కార్మికులకు జరిగిన నష్టానికి ప్రతిఫలంగా.. కనీస వేతనాల ప్రకారం నష్టపరిహారం కూడా అందజేస్తామని చెప్పారు. ఇక, ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా నిర్మాణ కార్యకలపాలపై నిషేధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంపై దేశ అత్తున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court) సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. కొద్ది రోజులు పాటు స్కూళ్లను మూసివేయడం, ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ చేయాలని సూచించింది. అంతేకాకుండా నిర్మాణ రంగం పనులను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Also read: కలుషిత రాజధానితో ప్రపంచానికి ఏం సంకేతాలు పంపుతున్నాం.. సుప్రీంకోర్టు
అయితే ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిలోకి ఉండటాన్ని పరిగణలోకి తీసుకున్న సుప్రీం కోర్టు.. ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతం (NCR)లో నిర్మాణ కార్యకలాపాలపై మళ్లీ నిషేధం విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం విధిస్తూ కోర్టు ఆదేశాలు జరీ చేసింది. అయితే కాలుష్య రహితమైన.. ప్లంబింగ్ పని, ఇంటీరియర్ డెకరేషన్, ఎలక్ట్రికల్ వర్క్ వంటివి కొనసాగించవచ్చని తెలిపింది.
కార్మికులు ఉపాధి కోల్పోయిన కాలానికి..రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి లేబర్ సెస్ కింద వసూలు చేసిన నిధులు భారీగా ఉన్నాయని, వాటి నుంచి కార్మికులకు చెల్లింపులు చేయాలని తెలిపింది. ఈ మేరకు సంబంధిత రాష్ట్రాలకు సుప్రీం కోర్టు ఆదేశాలు జరీ చేసింది. ఈ క్రమంలోనే ఢిల్లీ సర్కార్ కార్మికులకు చెల్లింపుల చేపట్టేందుకు సిద్దమైంది.
ఇక, ఢిల్లీ వాయు కాలుష్యంపై Supreme Court విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం మరోసారి కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వంపై మండిపడింది. తాత్కాలిక చర్యలు ఎంత మాత్రం ఉపయుక్తం కావని, దీర్ఘకాలికంగా శాశ్వత ఉపశమన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అంతేకాదు, ఇప్పుడు తీసుకునే చర్యలతో కాలుష్య ప్రమాణాలు కొంత తగ్గి పరిస్థితులు మెరుగుపడినా తాము విచారణను ఆపబోమని వెల్లడించింది. ఈ విచారణ కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు ఆదేశాలు, సూచనలు ఇస్తామని తెలిపింది. ‘ఇది దేశ రాజధాని. దేశ రాజధానిలోనే ఇంతటి కాలుష్యంతో ప్రపంచానికి ఏం సంకేతాలు ఇస్తున్నామో చూడండి’ అంటూ ఆగ్రహించింది.