రోజ్గార్ మేళా: 71 వేల మందికి జాబ్ లెటర్స్.. కొత్త ఆశలతో సంవత్సరం ప్రారంభమైందన్న ప్రధాని మోడీ
New Delhi: జాబ్ మేళాలో (రోజ్గార్ మేళా) 71 వేల మంది యువతకు అపాయింట్ మెంట్ (జాబ్) లెటర్లను ప్రధాని నరేంద్ర మోడీ పంపిణీ చేశారు. యువతనుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ రానున్న రోజుల్లో లక్షలాది కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయన్నారు. కొత్త ఆశలతో ఈ సంవత్సరం ప్రారంభమైందని పేర్కొన్నారు.
PM Modi-Rozgar Mela: రోజ్గార్ మేళాలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ 2023 సంవత్సరం మొదటి జాబ్ మేళాలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన 71,000 మందికి ప్రధాని అపాయింట్మెంట్ లెటర్లను (జాబ్ లెటర్స్) అందజేశారు. దీనితో పాటు, కొత్తగా నియమితులైన యువకులకు, వారి కుటుంబాలకు ప్రధాని అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో లక్షలాది కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయన్నారు. కొత్త ఆశలతో ఈ సంవత్సరం ప్రారంభమైందని పేర్కొన్నారు.
రోజ్గార్ మేళా కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. "ఇది 2023వ సంవత్సరంలో మొదటి జాబ్ మేళా. ఉజ్వల భవిష్యత్తు కోసం కొత్త ఆశలతో ఈ సంవత్సరం ప్రారంభమైంది. నేను ఉద్యోగాలు సంపాదించిన యువతీయువకులు.. అందరినీ, వారి కుటుంబాలను అభినందిస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి మరో లక్ష కుటుంబాలు అపాయింట్మెంట్లు పొందబోతున్నాయి" అని అన్నారు.
ఉపాధి మేళాలను ప్రభుత్వ గుర్తింపుగా అభివర్ణించిన ప్రధాని మోడీ.. "కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్డీఏ, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉపాధి మేళాలు నిరంతరం నిర్వహిస్తున్నారు. ఉపాధి కల్పనలో ప్రభుత్వం ప్రతిజ్ఞ చేసి, నిరూపించి చూపిస్తుందని" అన్నారు. రిక్రూట్మెంట్ ప్రక్రియలో మార్పులను ప్రస్తావిస్తూ, కేంద్ర ఉద్యోగాల నియామక ప్రక్రియ మునుపటి కంటే మరింత సమర్థవంతంగా, సమయానుకూలంగా మారిందని ప్రధాని మోడీ అన్నారు. రిక్రూట్మెంట్ ప్రక్రియలో పారదర్శకత, వేగం ప్రభుత్వం ప్రతి పనిలోనూ కనిపిస్తోందని చెప్పారు. .
పౌరులు ఎల్లప్పుడూ సరైనవారు అని ప్రధాని మోడీ అన్నారు. "వ్యాపార ప్రపంచంలో వినియోగదారు ఎల్లప్పుడూ సరైనవాడని వ్యాఖ్యలను పేర్కొంటూ.. అదేవిధంగా, పౌరుడు ఎల్లప్పుడూ సరైనవాడు (సిటిజన్ ఆల్వేస్ రైట్) అనేది ప్రభుత్వ నినాదంగా ఉండాలి. మేము నిరంతరం ఉపాధి-స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు కట్టుబడి ఉన్నాము. మౌలిక సదుపాయాల అభివృద్ధితో అవకాశాలు నిరంతరం పెరుగుతున్నాయి" అని ప్రధాని మోడీ అన్నారు. రెగ్యులర్ ప్రమోషన్లకు కూడా వివిధ కారణాల వల్ల ఆటంకం ఏర్పడిన సమయం ఉందనీ పేర్కొన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వ నియామక ప్రక్రియలో మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. ఇప్పుడు, కేంద్ర ప్రభుత్వంలో రిక్రూట్మెంట్ ప్రక్రియ మరింత కాలపరిమితితో క్రమబద్ధీకరించబడిందని తెలిపారు.
జిల్లా అభివృద్ధి చెందితే స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. మౌలిక సదుపాయాలను నిర్మించడంలో, ఉపాధి అవకాశాలను నిర్మించడంలో ఇప్పటివరకు ₹ 100 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టబడిందని తెలిపారు. కాగా, 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు గుర్తుగా గత ఏడాది రోజ్గార్ మేళా పథకాన్ని ప్రధాని ప్రారంభించారు. గత సంవత్సరం, అక్టోబర్, 2022లో మొదటి బ్యాచ్ 75,000 అపాయింట్మెంట్లు అందించారు. 2022 నవంబర్లో రెండవ జాబ్ మేళలో 71,000 అపాయింట్మెంట్లు అందించారు.